జగిత్యాల : టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుపేదలకు సామూహిక వివాహాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ బోర్డు సభ్యుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. తిరుమలలో గురు, శుక్రవారాల్లో జరిగిన టీటీడీ పాలకమండలి, ధర్మప్రచార కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనివారం తిరుమలలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ పాలకమండలి, దాని అనుబంధ ధర్మ ప్రచార కమిటీ మండలి సమావేశాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
ఏపీ తెలంగాణ, రాష్ట్రాల్లోని ప్రతి దేవాలయాలోనూ గోమాతను పెంచాలని, దీన్ని టీటీడీ పాలకమండలి ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు నిర్వహించినా.. టీటీడీ తరఫున సహాయం, కల్యాణ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు. గ్రామస్థాయిలో, నియోజక వర్గ కేంద్రాల్లో ఎక్కడ స్వామి వారి కల్యాణ ఉత్సవాలు నిర్వహించాలని భావించినా ఆ విషయాన్ని టీటీడీ పాలక వర్గంలో తెలియజేస్తే పాలక వర్గం, టీటీడీ సిబ్బంది సహకరిస్తారన్నారు.
రెండు రాష్ట్రాల్లో గతంలో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాలు, కల్యాణమండపాలు నిర్మించగా.. చాలా చోట్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఈ విషయంపై చర్చ జరిగిందని, పెండింగ్ పనులకు సహాయం చేయనున్నట్లు తెలిపారు. పెండింగ్ పనులను గుర్తించేందుకు నిపుణులతో కమిటీ వేశామన్నారు. కమిటీ రెండు రాష్ట్రాల్లోని వాటిని ప్రత్యక్షంగా గుర్తించి నివేదిక అందజేస్తుందని, ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని పాలకవర్గం తీర్మానించినట్లు చెప్పారు. త్వరలోనే నిపుణుల కమిటీ నిర్మాణాలను పరిశీలిస్తుందన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో పేదలకు సామూహిక వివాహాలను జరిపించాలని, నవ దంపతులకు రెండు మాసాల బంగారం సైతం అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ధర్మ ప్రచార మండలి ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ప్రచార మండలి సభ్యులను నియమించి వారితో ధర్మ ప్రచారం, హైందవ మత ఔనత్యాన్ని చాటి చెప్పాలని తీర్మానించినట్లు వివరించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర సభ్యులు తెలంగాణకు చెందిన పాలకమండలి సభ్యులకు గొప్పగా సహకారం అందిస్తున్నారు.