నాగర్కర్నూల్, ఫిబ్రవరి 12: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సామూహిక వివాహాలు కనులపండువగా జరిగాయి. ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆ ధ్వర్యంలో స్థానిక జెడ్పీ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపై 220 జంటలు ఒక్కటయ్యాయి. హిందూ, ముస్లిం, క్రిష్టియన్లకు వారి సంప్రదాయ పద్ధతుల్లో వివాహాలు జరిపించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఆయన సతీమణి జమునారాణి పెండ్లి పెద్దగా వ్యవహరిస్తూ ఓవైపు లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం, మరోవైపు జంటలకు ఒకేసారి వివాహాలు జరిపించారు. సినిమా సెట్టింగ్ను తలపించేలా భారీగా వేసిన మండపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకకు ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్రావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అతిథులుగా హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చి వేడుకను తిలకించారు. వచ్చిన వారందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశా రు. కొత్త జంటలకు పెండ్లికి ముందు పట్టువస్ర్తా లు, బంగారు తాళి, మెట్టెలు అందించగా, తరువాత బీరువా, మంచం, బెడ్, దిండ్లు, ట్రావెలింగ్ బ్యాగ్, టేబుల్ ఫ్యాన్, మిక్సీ, కుక్కర్, వంటసామగ్రిని బహూకరించారు. సాయం త్రం నూతన జంటలను డీజే డ్యాన్స్ల మధ్య అప్పగింతల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చందు, కలెక్టర్ ఉదయ్కుమార్ పాల్గొన్నారు.