ఖైరతాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ (KCR) స్ఫూర్తితో కులగణన, 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేపడుతామని బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీసీ కుల, విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య(Krishnaiah) మాట్లాడారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీసం బీసీలకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటీసీ అయ్యే అర్హత కూడా లేదా అని ప్రశ్నించారు. కులగణన చేయకుండా ప్రభుత్వం సాకులు చెబితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. బీసీల విశ్వసనీయత కోల్పోకముందే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా తక్షణమే కులగణన చేసి, 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
అధికార పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు సమగ్ర కులగణనపై ఆయా పార్టీలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మాటను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు మాట్లాడుతూ ప్రాణాలు పోయినా సరే సామూహిక ఆమరణ దీక్ష చేసి సమగ్రకులగణన, 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రఅధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, సోషల్జస్టిస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిడికిలి రాజు తదితరులు పాల్గొన్నారు.