తెలంగాణకు కొత్త కంపెనీల పెట్టుబడులు రావడానికి ఎంత ప్రాధాన్యమిస్తున్నామో, కార్యక లాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు మరింత పెట్టుబడి పెట్టడానికీ అంతే ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే అనేక కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు ఆసక్తి చూపుతున్నాయి.
– కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అమెరికా పర్యటనతో రాష్ర్టానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతున్నది. శుక్రవారం రాష్ర్టానికి రెండు పెట్టుబడులు వచ్చి చేరాయి. ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మార్స్ గ్రూప్ అదనంగా రూ.800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. మరోవైపు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ఓమ్నికాం మీడియా గ్రూప్’ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను నగరంలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో సుమారు 2,500 మందికి ఉపాధి లభించనున్నది. అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం న్యూయార్క్లో రెండు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. పెంపుడు జంతువులు (పెట్స్) తినే ఆహార ఉత్పత్తుల్లో సుప్రసిద్ధమైన మార్స్ గ్రూప్ నుంచి చీఫ్ డాటా అండ్ అనలిటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తి బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విస్తరణ ప్రణాళికలను, నూతన పెట్టుబడి వివరాలను సంస్థ ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటికే సిద్దిపేట కేంద్రంగా కొనసాగుతున్న తమ పెట్టుబడి, కార్యకలాపాల అనుభవాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. భారత్లో తమ ఉత్పత్తులకు అద్భుతమైన స్పందన వస్తుందని పేర్కొన్నది. పెట్ కేర్, పెట్స్ ఫుడ్కు డిమాండ్ మరింత పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో తెలంగాణ కేంద్రంగా మరింత విస్తరించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నది. ఉత్పత్తి ప్లాంట్ను విస్తరించటంతోపాటు రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అగ్రికల్చర్ సైప్లె చైన్, ఇన్నోవేషన్ అండ్ ససె్టైనబిలిటీ వంటి వివిధ రంగాల్లోనూ తమ కార్యకలాపాలు విస్తరిస్తామని వివరించింది.
కంపెనీ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మార్స్ గ్రూప్నకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణకు కొత్త కంపెనీల పెట్టుబడులు రావడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు మరింత పెట్టుబడి పెట్టడానికి అంతే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న అనేక కంపెనీలు పెద్దఎత్తున తిరిగి రాష్ట్రంలో విస్తరణకు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. దీంతో స్థానికంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు. కంపెనీ విస్తరణకు పెట్టుబడి పెట్టడం అంటే ఆ ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి సూచిక అని పేర్కొన్నారు. మార్స్ గ్రూప్ తెలంగాణలో రూ.200 కోట్ల పెట్టుబడితో ప్రారంభమై తాజా ప్రకటనతో రూ.1,500 కోట్ల స్థాయికి చేరిందని తెలిపారు. భవిష్యత్తులోనూ సంస్థ మరింతగా విస్తరిస్తున్నదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మార్స్ గ్రూప్ ముందుగా రూ.200 కోట్లతో సిద్దిపేటలో పెట్స్ ఫుడ్ తయారీ ప్లాంట్ను ప్రారంభించింది. 2021 డిసెంబర్లో మరో రూ.500 కోట్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ మేరకు కార్యకలాపాలను విస్తరించింది. తెలంగాణలో సంస్థ అనుభవాలు, పెట్టుబడుల అనుకూల వాతావరణం, ప్రభుత్వ విధానాలు వంటి అనేక సానుకూలతల నేపథ్యంలో మరో రూ.800 కోట్ల విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది.
భారత్తోపాటు అంతర్జాతీయంగా అనేక నగరాలను పరిశీలించిన తర్వాత హైదరాబాద్లో తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు సంస్థ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జైద్ అల్ రషీద్ తెలిపారు. తమ సంస్థ కార్యకలాపాలు 100 దేశాల్లో కొనసాగుతున్నాయని, ఈ క్రమంలో భారత్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు గ్లోబల్ సెంటర్ సహకరిస్తుందని వివరించారు. ఈ కేంద్రం కార్యకలాపాల ద్వారా తమ సంస్థ వృద్ధిని సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మే నెల నుంచి తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ కార్యాలయం నుంచి తమతో సంప్రదింపులు, చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సెంటర్ ఏర్పాటుకు సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రముఖ సంస్థ ‘ఓమ్నికాం మీడియా గ్రూప్’ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో సుమారు 2,500 మందికి ఉపాధి లభించనున్నది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ శుక్రవారం ఓమ్నికాం సీనియర్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. దీనిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మీడియా, అనుబంధ రం గాల్లో ఇన్నోవేషన్, వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. ఈ దిశగా ఓమ్ని కాం ప్రకటన ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. ఈ కేంద్రం ఏర్పాటుతో 2,500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయని, ఇది తనకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తున్నదని అన్నారు. ఈ ఏడాది మేలోనే సంస్థతో ప్రాథమిక చర్చలు జరిపామని, కేంద్రం ఏర్పాటుకు విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. హైదరాబాద్లో మీడియా అనుబంధ రంగాల్లో అందుబాటులో ఉన్న మానవ వనరులు, మౌలిక వసతులను వివరించామని పేర్కొన్నారు.