హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ‘ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిం దే’ అన్నట్టు తయారైంది మర్రి శశిధర్రెడ్డి పరిస్థితి. బీజేపీలో ఘన స్వాగతం లభిస్తుందని ఆశించిన ఆయనకు చేరిక రోజే తత్వం బోధపడింది. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్కు రాజీనామా చేసిన శశిధర్రెడ్డి.. ‘అమిత్షాతో చర్చించాను. త్వరలో బీజేపీలో చేరుతా..’ అని ప్రకటించారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలోనో, హోం మంత్రి అమిత్షా సమక్షంలోనో పార్టీలో చేరుతారని భావించారు.
తమ నాయకుడికి అదే సరైన గౌరవమని అనుచరులు కూడా అనుకున్నారు. తీరా సీన్ రివర్స్ అయ్యింది. చేరిక కార్యక్రమానికి నడ్డా డుమ్మాకొడితే.. అమిత్ షా కనీసం అటుదిక్కు చూడలేదు. చివరికి కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలోనే ఆయన పార్టీలో చేరాల్సి వచ్చింది. కనీసం పార్టీ అధ్యక్షుడో, ప్రధాన కార్యదర్శో రాకుండా.. ఓ కేంద్రమంత్రి కండువా కప్పి ఆహ్వానించడం ఆయన అనుచరులకు మింగుడుపడటం లేదు. ‘ఆ మాత్రం దానికి ఢిల్లీ దాక ఎందుకు? రాష్ట్రంలోనే ఎవరో ఒక నాయకుడితో కండువా కప్పుకుంటే సరిపోయేది కదా?’ అని వారంతా గొణుక్కుంటున్నారు.