ఏప్రిల్ నెల ముగియడానికి వస్తున్నా.. మార్చి నెల వేతనం ఇంకా రాకపోవడంతో అంగన్వాడీలు అరిగోస పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామని, రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ అందజేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్.. తీరా గద్దెనెక్కాక తమను మర్చిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరచేతిలో స్వర్గం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రత్యక్షంగా నరకం చూపిస్తున్నదని వాపోతున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తేతెలంగాణ): ప్రతినెలా వేతనాలు ఆలస్యమవుతుండడంతో అంగన్వాడీ సిబ్బంది అరిగోసపడుతున్నారు. ఏప్రిల్ నెల ముగుస్తున్నా మార్చి వేతనాలు ఖాతాల్లో జమకాకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. ఐసీడీఎస్ అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. నెల ఫస్ట్ తారీఖునే జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో సుమారు 70 వేల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక కుటుంబ నిర్వహణ, రోజువారీ ఖర్చులకు ఇక్కట్లకు గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగైదు నెలలు ఫస్ట్ తేదీనే ఖాతాల్లో వేతన సొమ్ము జమచేసి మురిపించిందని, రెండేండ్లుగా ఆలస్యంగా అందజేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు అక్షరాలు దిద్దిస్తూ, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ, సర్వేలు, ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్న తమను విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.18 వేలకు, హెల్పర్లకు రూ.13వేలకు పెంచుతామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీల వర్షం గుప్పించిందని, తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవర్లోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా ఖజానాలో నిధుల్లేవని సాకులు చెబుతూ సుమారు 10 వేల మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా గోసపెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్న మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. రెండున్నరేండ్లుగా ఇచ్చిన వినతులను బుట్టదాఖలు చేయడం తప్ప చేసిందేమీ లేదని పెదవి విరుస్తున్నారు. ఖాళీగా ఉన్న సుమారు 15 వేల టీచర్లు, హెల్పర్ల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటనలు గుప్పించడం, మరిచిపోవడం మంత్రికి పరిపాటిగా మారిందని మండిపడుతున్నారు.
అంగన్వాడీ టీచర్లంటే కాంగ్రెస్ సర్కారుకు చిన్నచూపేందుకని అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ (మినీ) రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి ప్రశ్నించారు. మినీ అంగ న్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చిన ప్రభుత్వం టీచర్లు, ఆయాలకు 12 నెలల వేతనాలు పెండింగ్లో పెట్టిందని మండిపడ్డారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించు కోవడంలేదని విమర్శించారు. తక్షణం వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.