(ఎక్కల్దేవి శ్రీనివాస్, స్టేట్ బ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ): పెన్గంగ..! రెండు రాష్ర్టాల మధ్య సరిహద్దుగా ఉన్న నది. అటువైపు మహారాష్ట్ర. ఇటువైపు తెలంగాణ. కానీ, నదికి ఇరువైపులా ఉన్న ప్రభుత్వ పాఠశాలల మధ్య ఎంతో తేడా! నదికి అటు వైపు రేకుల షెడ్లు.. వాటి చుట్టూ రాళ్లురప్పలు. ఇటువైపు పక్కా భవనాలు. వాటి మధ్య నునుపు తేలిన గచ్చు. అటువైపు మరాఠీ భాషలో విద్యా బోధన. ఇటువైపు ఇంగ్లిష్ మీడియం చదువులు. కంప్యూటర్ పాఠాలు. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో మహారాష్ట్ర విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. వీరికి టీఎస్ఆర్టీసీ ఉచిత బస్ పాస్ కూడా ఇస్తుండటంతో ఆడపిల్లలను సైతం తెలంగాణకు పంపిస్తున్నారు మహారాష్ట్రలోని విద్యార్థుల తల్లిదండ్రులు. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ఆదివాసీ గిరిజన ప్రాంతాల విద్యార్థులు సైతం ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడానికి ఉత్సాహం చూపిస్తుండటం మరో విశేషం.
‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు ఇవీ!
మహారాష్ట్రలో ఇలా..
ఇది పెన్గంగ నదికి అటువైపున మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా కేలాపూర్ తాలూకా సున్నా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉచ్ఛ్ ప్రాథమిక్ కేంద్రం. అంటే హైస్కూలు. రాళ్లు రప్పలతో కూడిన ప్రాంగణం.. నాలుగువైపులా గోడలపై ఇనుప రేకులతో ఏర్పాటుచేసిన తరగతి గదులు.. పాడుబడిన మూత్రశాలలు.. పనికిరాకుండా పాడైన ఇతర గదులు.. ఇక్కడి చదువుల తీరును చెప్పకనే చెప్తున్నాయి. అక్కడి ప్రభుత్వం పాఠశాలకు కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదు. ఇక్కడ కేవలం మరాఠీ మీడియంలోనే చదువు చెప్తారు. మధ్యాహ్నం భోజనంలో కిచిడీ, నీళ్ల చారు.. వారానికి ఒకసారి మాత్రమే కోడిగుడ్డు ఇస్తారు. ఇక్కడ 1 నుంచి 8వ తరగతి వరకు 150 మంది విద్యార్థులు, 9-10 తరగతుల్లో 80 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు.
తెలంగాణలో ఇలా
ఇది పెన్గంగకు ఇటువైపున తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పరవాడలోని ఉన్నత పాఠశాల.. ఈ పాఠశాల తరగది గదులన్నీ పక్కా భవనాలే. తాజాగా మరొకటి నిర్మిస్తున్నారు. ఇక్కడ ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు 102 మంది, 6 నుంచి 10 తరగతి వరకు 154 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ప్రతిరోజూ సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పు వడ్డిస్తారు. వారానికి మూడు రోజులు (రోజు విడిచి రోజు) కోడిగుడ్డు పెడతారు. పిల్లలందరికీ యూనిఫాం తెలంగాణ ప్రభుత్వమే సరఫరా చేస్తున్నది. సైన్స్ ల్యాబ్ ఉన్నది. టీచర్లందరూ కలిసి కంప్యూటర్లు, ప్రొజెక్టర్లను సమాకూర్చారు. 6 నుంచి పదో తగతి వరకు కంప్యూటర్ పాఠాలు చెప్తున్నారు. దీంతో పెన్గంగకు అటువైపున ఉన్న మహారాష్ట్రలోని పలు గ్రామాల విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి చదువుకొంటున్నారు. టీఎస్ఆర్టీసీ ఉచిత బస్సుపాస్ సదుపాయం కల్పించడంతో వారు ఉదయం పాఠశాలకు వచ్చి.. సాయంత్రం తిరిగి వెళ్తున్నారు. ఇంగ్లిష్ మీడియం ప్రాధాన్యాన్ని గుర్తించిన పిప్పరవాడ గ్రామ ప్రజలు మూడేండ్ల క్రితమే ఆంగ్ల మాధ్యమానికి శ్రీకారం చుట్టారు. దీనితో గ్రామంలో ఉన్న ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూలులో.. గత సంవత్సరం నుంచి ఒకటి, రెండో తరగతులను పూర్తిగా మూసేశారు. ఇప్పుడు గ్రామంలోని పిల్లలందరూ ప్రభుత్వ స్కూలులో ఆంగ్ల మాధ్యమంలో చదువుకొంటున్నారు.
వినూత్న పద్ధతిలో బోధన
ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ) మండలం అల్లీగూడ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలలో ఒక ఆదివాసీ బాలుడు (ఒకటో తరగతి) ఆంగ్ల అక్షరాలను వినూత్న పద్ధతిలో ఆసక్తిగా నేర్చుకొంటున్నాడు. నేలపై గజిబిజిగా రాసిన ఆంగ్ల అక్షరాలుంటాయి. బోర్డుపై ఉన్న ఏ, బీ, సీ, డీలను చూస్తూ నేలపై రాసిన అక్షరాలను గుర్తించాలి. వాటిని పలకపై రాయాలి. ఈ పద్ధతిలో అక్షరాలను త్వరగా నేర్చుకొంటున్నారు. నిజానికి అల్లీగూడలో కేవలం ఆరుగురే పిల్లలు ఉన్నారు. పక్కనే ఉన్న ఆంగన్వాడీలోని చిన్నారులు కూడా ఈ పాఠశాలకు వచ్చి చదువు నేర్చుకొంటున్నారు. ఈ స్కూలులో పనిచేస్తున్న సంతోష్ రెగ్యులర్ ఉపాధ్యాయుడు కాదు. కాంట్రాక్ట్ పద్ధతిలో సీఆర్టీగా పనిచేస్తున్నాడు. ఆదివాసీ పిల్లలకు ప్రేమతో వినూత్నంగా చదువు చెప్తున్నాడు. ఇంగ్లిష్ మీడియం బోధనపై అల్లీగూడ సర్పంచ్ ఆత్రం పద్మారాజేశ్వర్ సంతోషం వ్యక్తంచేశారు.
తెలంగాణలో సీఎం బాగా చేస్తున్నారు
నేను డిగ్రీ వరకు చదువుకొన్నా. వ్యవసాయం చేస్తున్నా. మా దగ్గరి పాఠశాలలు సరిగా లేవు. మా పిల్లలు రేకుల షెడ్లలోనే చదువుకొంటున్నారు. తెలంగాణలో బ్రహ్మాండంగా ఉన్నాయి. మా దగ్గర మరాఠీ మీడియంలోనే చదువు చెప్తున్నారు. తెలంగాణలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారు. ప్రస్తుత పోటీ వాతావరణంలో ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి. ఒక్క పాఠశాలలే కాదు. తెలంగాణలో అన్నీ బాగున్నాయి. రైతుబంధు, కల్యాణలక్ష్మి, పింఛన్లు.. ఇలా అనేక పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇస్తున్నారు. ఇలాంటి పథకాలు మా దగ్గర ఉంటే బాగుండు. మేమూ తెలంగాణలో ఉంటే మంచిగుంటుండే అనుకుంటూ ఉంటాం. -మామిడ్వార్ పృథ్వీ, సున్నా గ్రామం, కేలాపూర్ తాలూకా, మహారాష్ట్ర
తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా బస్ పాస్ ఇచ్చింది
మాది మహారాష్ట్రలోని పిప్పల్కోటి. అక్కడ మరాఠీ మీడియంలో చెప్తారు. అందుకే ఇక్కడ నిరుడు 8వ తరగతిలో జాయిన్ అయ్యా. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా బస్సు పాస్ ఇచ్చింది. రోజూ టీఎస్ఆర్టీసీ బస్సులో వచ్చి, పోతుంటా. ఇక్కడ చదువు బాగా చెప్తున్నారు. ఇక్కడ వసతులు కూడా బాగున్నాయి. మధ్యాహ్న భోజనం చాలా బాగున్నది. -బాహునే ప్రణయ, 9వ తరగతి విద్యార్థిని, పిప్పరవాడ హైస్కూల్