కొత్తగూడెం క్రైం, జూన్ 28: ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఉనికిని చాటుకునేందుకు ఉపసర్పంచ్తో సహా మరొకరిని కిడ్నాప్ చేసి హతమార్చినట్టు సమాచారం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా తాడిమెట్ల ఉపసర్పంచ్ మాడ్వి గంగను కిడ్నాప్ చేసి ప్రజాకోర్టు నిర్వహించేందుకు మరికొందరిని వారితో తీసుకెళ్లారు. పదిరోజులుగా వారు మావోయిస్టుల చరలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ ఘటనపై స్పందించిన పోలీస్ యంత్రాంగం, ఆదివాసీ సంఘాలు వారిని విడిపించే ప్రయత్నం చేశాయి.
ఈ ఘటనపై సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ను వివరణ కోరగా.. మావోయిస్టుల చెరలో ఉన్న గంగతో పాటు గ్రామస్థులను సురక్షితంగా విడిపించేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. ఈ లోపు మావోయిస్టులు ఎత్తుకెళ్లిన ఉపసర్పంచ్ గంగతోపాటు మరో వ్యక్తిని బుధవారం సాయంత్రం ప్రజాకోర్టు నిర్వహించి హతమార్చినట్టుగా సమాచారం. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మరో వ్యక్తి అధ్యాపకుడు సుక్కా కవాసిగా తెలుస్తున్నది. ఘటనా స్థలంలో మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో లేఖను విడుదల చేశారు.