కొత్తగూడెం క్రైం, జనవరి 7: ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అరాచకాలకు పాల్పడుతున్నారు. కనికరం లేకుండా సొంత క్యాడర్నే మట్టుపెడుతున్నారు. పెండ్లి చేసుకొని పార్టీని వీడాలనుకొన్న ఓ ప్రేమ జంటను పాశవికంగా హత్యచేశారు. ఈ ఘటన గురువారం జరిగింది. బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజ్ పాటిలింగం శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు పార్టీ మిలీషియా ప్లాటూన్ కమాండర్ కమ్లు పూనెం, సభ్యురాలు మంగి కొంతకాలంగా ప్రేమించుకొంటున్నారు. మావోయిస్టు పార్టీని వీడాలని నిశ్చయించుకొన్నారు. గురువారం మావోయిస్టు క్యాంపు నుంచి పారిపోతుండగా మావోయిస్టులు వారిని అడ్డుకొని దారుణంగా హతమార్చారు. అదేరోజు గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇదినార్ ప్రాంతంలో మరో వ్యక్తిని హత్య చేశారని ఐజీ తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉన్నదని చెప్పారు.
చర్ల మావోయిస్టు ఎల్వోఎస్, ఎల్జీఎస్ కమాండెంట్లు మధు, రాజేశ్, డీసీఎస్ ఆజాద్.. అమాయక ఆదివాసీలను ఇన్ఫార్మర్ల నెపంతో దారుణంగా హత్య చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్దత్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీలోని కొందరు వ్యక్తులు మహిళా మావోయిస్టులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వారికి లొంగని అమాయక మహిళలను ఇన్ఫార్మర్ నెపంతో చంపేస్తున్నారని తెలిపారు.