సుబేదారి, ఏప్రిల్ 21 : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దేవేందర్రెడ్డి అలియాస్ మాధవ్తోపాటు సానుభూతిపరుడు తిరుపతిరెడ్డిని సుబేదారి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.21 వేల నగదు, విప్లవ సాహిత్యం, పెన్డ్రైవ్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకొన్నారు. దేవేందర్రెడ్డిపై రూ.20 లక్షల రివార్డు ఉన్నది. శుక్రవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్లో వీరిద్దరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి, సీపీ ఏవీ రంగనాథ్ వివరాలు వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెలుక గ్రామానికి చెందిన మూల దేవేందర్రెడ్డి అలియాస్ మాధవ్ 7వ తరగతి వరకు చదివి, 1978లో అప్పటి పీపుల్స్వాల్ రాడికల్ విభాగానికి ఆకర్షితుడై, 1982లో సిర్పూర్ దళ సభ్యుడిగా చేరాడు. 1987లో దళ సభ్యురాలు ఆత్రం బయ్యక అలియాస్ జ్యోతిని వివాహం చేసుకొన్నాడు. 1994లో పీపుల్స్వార్, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జ్యోతి మరణించింది. 1996లో టెక్నికల్ డిపార్ట్మెంట్ కమాండర్గా పనిచేసిన దేవేందర్రెడ్డి ఇప్పటివరకు సుమారు 850కి పైగా తుపాకులను, మందుపాతరలు, రాకెట్ లాంచర్లు తయారు చేసి దళాలకు అందజేశాడు. 2007లో చర్ల మీదుగా దండకారణ్యానికి తయారుచేసిన తుపాకులను తీసుకెళ్తుండగా, పోలీసులకు పట్టుబడ్డారు.
2009లో వరంగల్ జైలు నుంచి విడుదలైన అనంతరం దేవేందర్రెడ్డి తన భార్య రూపితో కలిసి తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2010లో హిడ్మా మరో 300 మంది మావోయిస్టులతో కలిసి ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పరిధి తాడిమెట్ల అటవీప్రాంతంలో 75 మంది సీఆర్పీఎఫ్ పోలీసులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి హత్య చేసిన ఘటనలో దేవేందర్రెడ్డి కీలక నిందితుడు. కొద్దికాలంగా కంటిచూపు సమస్యతో బాధపడుతున్న దేవేందర్రెడ్డి.. సానుభూతిపరుడు తిరుపతిరెడ్డితో కలిసి హైదరాబాద్ వెళ్తుండగా సుబేదారి బస్స్టాప్ వద్ద పోలీసులకు చికారు.