హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల బంద్ (Maoist Bandh) కొనసాగుతున్నది. బీజేపీ, హిందుత్వ ఫాసిస్టు కగార్ (Operation Kagar) దాడిని ఖండిస్తూ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ను జయప్రదం చేయాలంటూ ఈనెల 15న తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. 45 ఏండ్ల సుదీర్ఘ విప్లవోద్యమ అనుభవం కలిగిన సీనియర్ రాష్ర్ట కమిటీ సభ్యుడు కామ్రేడ్ టీఎల్ఎన్ఎస్ చలం అలియాస్ ఆనంద్, సుధాకర్, గౌతం, 30 ఏళ్ల విప్లవోద్యమ అనుభవం కలిగిన కామ్రేడ్ మైలారపు ఆడెల్ అలియాస్ భాస్కర్ తెలంగాణ రాష్ర్ట కమిటీ సభ్యులతో పాటు ఏడుగురిని క్రూరంగ హత్య చేసిన ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ బంద్ నిర్వహిస్తున్నామని ప్రకటించింది.
అయితే ఆ తర్వాత రెండు రోజులకు జరిగిన మరో ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన అత్యంత కీలకనేత కేంద్ర కమిటీ ప్రతినిధి గాజర్ల రవి, మరో సీనియర్ మావోయిస్ట్ అరుణ మృతి చెందారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టుల నుండి ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లితో పాటు ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు జిల్లా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో అక్కడక్కడ బంద్ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా బంద్ విజయవంతం కాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడిక్కడే బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.