హైదరాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ): పాక్షిక సూర్యగ్రహణం కారణంగా మంగళవారం రాష్ట్రంలోని దాదాపు అన్ని ఆలయాలను మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం మళ్లీ యథావిధిగా భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. మంగళవారం సాయంత్రం నుంచి పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడిన విషయం విదితమే. దీంతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఉదయం పూజల అనంతరం మూసివేశారు.
వేములవాడ రాజన్న ఆలయంతో పాటు కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం, నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయం, మహబూబ్నగర్ జిల్లాలోని మన్యంకొండ కురుమూర్తి చిన్న రాజమూర్ ఆంజనేయ స్వామి, నాగర్ కర్నూల్లోని ఉమామహేశ్వర ఆలయం, జోగులాంబ దేవాలయంతో పాటు గద్వాల జిల్లాలోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం, ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు, సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయం, రేణుక ఎల్లమ్మ ఆలయం, పోచమ్మ ఆలయం, హనుమాన్ ఆలయం, భద్రాచలం రామాలయం, ఖమ్మం జిల్లా జమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయం, హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, సికింద్రాబాద్, పాతబస్తీలోని మహంకాళీ ఆలయాలు, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని కేతకి సంగమేశ్వర ఆలయాలను మూసివేశారు.