దంతాలపల్లి, ఆగస్టు 2 : ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన శ్రీనలంద స్కూల్ బస్సు దంతాలపల్లి మండలం పెద్దముప్పారం, కుమ్మరికుంట్ల, దంతాలపల్లిలో విద్యార్థులను ఎక్కించుకొని మరికొందరిని తీసుకొచ్చేందుకు బొడ్లాడ గ్రామానికి బయల్దేరింది. గ్రామ శివారుకు చేరుకోగానే బస్సు రోడ్డు గుంతలోకి దూసుకెళ్లి వ్యవసాయ పొలంలో బోల్తా పడింది.
అందులోని విద్యార్థులు కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు వచ్చి వారిని కాపాడారు. ఈ ఘటనలో పరిమిత, సిద్దార్థ, మితున్రెడ్డి, చిన్ను, మహేశ్వరి, మణిదీప, తనూశ్రీలతోపాటు మరికొందరికి గాయాలయ్యాయి. వారిని తొర్రూరు దవాఖానకు తరలించారు. బస్సు స్టీరింగ్ సరిగాలేకపోవడం, డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.