హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీ క్యాంపస్లలో చేరాలని చాలా మంది విద్యార్థులు ఆశిస్తుంటారు. సీటు రావడమే ఆలస్యం.. మరో ఆలోచన లేకుండా చేరిపోతారు. కానీ ఈ ఏడాది యూనివర్సిటీ కాలేజీల్లోని బీటెక్ కోర్సుల్లో పూర్తి సీట్లు భర్తీ కాలేదు. ఈ కోర్సుల్లో కేవలం 81.20 శాతం సీట్లే నిండాయి. ఇంకా 20 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. అదే ప్రైవేట్ వర్సిటీల్లో 83 శాతం, ప్రైవేట్ కాలేజీల్లో 85 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంజినీరింగ్ రెండో విడత సీట్లను అధికారులు సోమవారం కేటాయించారు.
రెండో విడతలో కొత్తగా 7,417 మందికి సీట్లు కేటాయించగా, మరో 25,148 మంది సీట్లు మార్చుకున్నారు. నచ్చిన బ్రాంచీలోనో, కాలేజీలోనో సీటు దక్కకపోవడంతో సీట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మొదటి, రెండో విడత కౌన్సిలింగ్ పూర్తయ్యాక మొత్తంగా 85.47 శాతం సీట్లు కేటాయించారు. 174 కాలేజీల్లో 82,702 సీట్లు ఉన్నాయి. 70,689 సీట్లు కేటాయించగా, 12,013 సీట్లు మిగిలాయి. రెండో విడత తర్వాత వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న 4,701 మంది సీట్లు దక్కించుకోలేకపోయారు. సీట్లు పొందినవారు ఆగస్టు 2లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అడ్మిషన్స్ కన్వీనర్ వాకాటి కరుణ సూచించారు.
రిపోర్టింగ్ తప్పనిసరి…
సీట్లు పొందిన విద్యార్థులు అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అలాల్మెంట్ ఆర్డర్లో పేర్కొన్న ఫీజును విద్యార్థి క్రెడిట్, డెబిట్కార్డు లేదా నెట్బ్యాకింగ్ ద్వారా ఆన్లైన్లో చెల్లిస్తే సీటు కన్ఫర్మేషన్ అవుతుంది. వీరంతా మూడో విడత కౌన్సిలింగ్ పూర్తయ్యాక ఆగస్టు 9 నుంచి 11లోగా కాలేజీల్లో ఒరిజినల్ టీసీ సమర్పించి, ప్రత్యక్షంగా రిపోర్ట్ చేయడం మర్చిపోతే సీటు కోల్పోయినట్టే. ఇక తుది విడత కౌన్సిలింగ్ ఆగస్టు 4 నుంచి నిర్వహించనున్నారు.