నర్సింహులపేట, సెప్టెంబర్ 2: ‘పేదలు, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సర్కారుకు అండగా ఉంటా.. అడగకుండానే వరాలిచ్చే మహానుభావుడు సీఎం కేసీఆర్.. మళ్లీ సీఎంగా సారే రావాలె’.. అని ఆరు ప్రభుత్వ పథకాలు పొందిన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడేనికి చెందిన ఉపేంద్ర అన్నది. తనకు రైతుబీమా, రైతుబంధు, గొర్రెల పంపిణీ, కల్యాణలక్ష్మి, వితంతు పింఛన్, రుణమాఫీ పథకాలు అందినట్టు చెప్పింది. ప్రభుత్వ పథకాలతో సంతోషంగా కుటుంబాన్ని పోషిస్తున్నట్టు తెలిపింది.
కేసీఆర్ పదికాలాలు చల్లగా ఉండాలి
భర్త సచ్చిపోయిన తర్వాత కష్టాలు ఉంటాయని భయంగా ఉండె. 10 రోజుల్లో నా ఖాతాలో రూ.5 లక్షలు జమ చేసింది ప్రభుత్వం. మొదటి విడతలోనే 21 గొర్రెలు ఇచ్చింది. వాటితో చాలా వరకు లాభం వచ్చింది. నా బిడ్డ పెండ్లికి లక్షా నూట పదహారు నా ఖాతాలో వేసింది. నాకు ఉన్న ఐదు ఎకరాలకు ఏటా రూ.50 వేలు వేస్తున్నది. నాకు వింతతు పింఛన్ ఇస్తున్నది. నా భర్త ఉన్నప్పుడు బ్యాంకులో తీసుకున్న పంట రుణం రూ.50 వేలు కూడా మాఫీ అయితాంది. ఇంత కన్న మంచిగా పథకాలు ఇస్తున్న నాయకుడు ఎవరు లేరు. కేసీఆర్ సారుకు మా కుటుంబం మద్దతుగా ఉంటాం.
– జక్కుల ఉపేంద్ర, పడమటిగూడెం