హైదరాబాద్, మార్చి10 (నమస్తే తెలంగాణ): మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకూ నెలకు రూ.2,500 ఇస్తామన్నారు.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా అమలు చేస్తామన్నారు.. మూడు నెలలు దాటినా దాని ఊసే ఎత్తడం లేదు.. మరేదో చేస్తామంటూ ఊదరగొడుతున్నారు.. అంటూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలపై అడుగడుగునా మహిళలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండటంతో కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు మరో ఎత్తుగడ వేసినట్టు తెలుస్తున్నది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ మరో మూడు నాలుగు రోజుల్లో రానున్న నేపథ్యంలో మహిళలను బురిడీ కొట్టించేందుకు డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలను ఇస్తామంటూ ప్రకటనలు చేస్తున్నది. అందులో భాగంగానే 12న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాలకు చెందిన లక్ష మంది మహిళలతో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది. రాష్ట్రంలోని 4,39,717 స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 47,36,868 మంది సభ్యులకు వడ్డీలేని రుణాలను అందిస్తామని చెప్తున్నది.
మండిపడుతున్న మహిళలు
వడ్డీలేని రుణాల హామీపై మహిళలు మండిపడుతున్నారు. ఆరు గ్యారెంటీలను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని అమలు చేస్తామని గప్పాలు కొట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 అందించే అంశాన్ని వదిలిపెట్టి వడ్డీలేని రుణాలంటూ పాటపాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఎన్నికల ఎత్తుగడ తప్ప ఏమీ లేదని విమర్శిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే మహాలక్ష్మి పథకాన్ని ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ప్రారంభించాలని, ముందుగా దాని మార్గదర్శకాలను జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.