హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మతకలహాలకు తావులేకుండా చేశామని డీజీపీ ఎం మహేందర్రెడ్డి అన్నారు. 2021లో రాష్ట్రంలో చిన్నచిన్న ఘటనలు మినహా మత కలహాలు లేవని తెలిపారు. పలు కారణాలవల్ల 2020తో పోలిస్తే 2021లో నేరాల నమోదు 4.6 శాతం పెరిగిందని చెప్పారు. అదే సమయంలో నేర నిరూపణ రేటు 50.03 శాతానికి పెరిగిందని వివరించారు. రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టడంపై మరింత దృష్టిపెడుతామని డీజీపీ ఎం మహేందర్రెడ్డి తెలిపారు. రోజువారీ జీవితంలో సాంకేతికత వినియోగంతోపాటు సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, దీనిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. పోలీస్ విధుల్లో టెక్నాలజీ వినియోగం మరింత పెంచుతామని చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించేలా బంజారాహిల్స్లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ను మరో నాలుగు నెలల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభిస్తారని వెల్లడించారు. ‘పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సీఎం కేసీఆర్ స్వప్నం. ఇది టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్. రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని ఈ సెంటర్ నుంచి మానిటర్ చేయవచ్చు’ అని వివరించారు. డీజీపీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర పోలీస్శాఖ వార్షిక నివేదిక-2021ను డీజీపీ విడుదలచేశారు. 2022లో పోలీస్ వ్యవస్థలో సిబ్బంది వ్యవహారాలన్నీ పేపర్లెస్గా మార్చి హెచ్ఆర్ఎంఎస్ విధానం అమల్లోకి తెస్తామని తెలిపారు. సీసీటీఎన్ఎస్ మొబైల్ బేస్డ్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తేబోతున్నట్టు చెప్పారు. ఏడాది వ్యవధిలో 98 మంది మావోయిస్టులను అరెస్టుచేసి తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో పోలీసులు విజయవంతమయ్యారని తెలిపారు.
నేరాల కట్టడికి అత్యాధునిక పద్ధతులను వాడుతున్నట్టు డీజీపీ తెలిపారు. సైబర్ నేరాల దర్యాప్తు కోసం ఇంటెలిజెన్స్ విభాగం ఇప్పటికే సిటిజన్ ఫైనాన్సియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) ఏర్పాటు చేసిందని, దీనిద్వారా ఇతర రాష్ర్టాల పోలీసులతోనూ సైబర్ నేరగాళ్ల డాటా పంచుకొనే అవకాశం ఏర్పడిందని చెప్పారు. ఈ సాంకేతికతతో గత ఆరు నెలల్లో 25 వేల కేసులు దర్యాప్తు చేశామని తెలిపారు. సైబర్ నేరగాడు బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కొట్టేసిన 24 గంటల్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారి డబ్బును ఈ సిస్టం ద్వారా వెనక్కి రప్పించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుల పర్యవేక్షణకు సీఐడీ విభాగంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సెల్ ద్వారా గత రెండేండ్లలో వివిధ విభాగాల సమన్వయంతో బాధితులకు రూ.90 కోట్ల పరిహారం ఇప్పించామని, ఈ ఏడాది 14 ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దోషులకు జీవితఖైదు శిక్షలు పడినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఏ నేరం చేసినా తప్పించుకోలేరన్న భయాన్ని నేరస్థుల్లో పోలీసులు కల్పించారని పేర్కొన్నారు. మహిళలకు భరోసా సెంటర్లు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయని, ఈ ఏడాది మరో 7 నెలకొల్పుతామని చెప్పారు. సమావేశంలో అడిషనల్ డీజీలు రవిగుప్తా, జితేందర్, సందీప్శాండిల్య, రాజీవ్త్రన్, మహేశ్భగవత్, బాలనాగదేవి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్వ్రీంద్ర, ఐజీలు నాగిరెడ్డి, సంజయ్జైన్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ విధి నిర్వహణకు ఏర్పాటుచేసిన 17 పని విభజన అంశాల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో సైదులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు స్టేషన్ ఎస్హెచ్వో ఆర్ భానుప్రకాశ్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఎస్హెచ్వో ఏ అశోక్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లోని వేంసూరు స్టేషన్ ఎస్హెచ్వో బీ సాయికుమార్కు డీజీపీ మహేందర్రెడ్డి అవార్డులు అందజేశారు.