Congress | హైదరాబాద్ సిటీబ్యూరో/చార్మినార్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో టికెట్ల పంచాయితీ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి చేరింది. ‘అమ్మవారిపై ప్రమాణం..’ మాట టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి దడ పుట్టిస్తున్నది. రూ.10 కోట్లు, ఐదెకరాల భూమి అంటూ కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్రెడ్డి చేసిన ఆరోపణల వ్యవహారం తారస్థాయికి చేరింది. రేపో మాపో ఈ పంచాయితీ ఈడీకి చేరనున్నది. గతంలో అమ్మవారిపై ప్రమాణం చేసిన రేవంత్రెడ్డికి మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. ఆరోపణలు వట్టివేనని వదిలేస్తే ఆయన గతంలో అమ్మవారిపై ప్రమాణం చేశారు కాబట్టి.. మరోసారి ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని కాంగ్రెస్ అగ్రనాయకులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. కానీ, ఇందుకు రేవంత్రెడ్డి వారికి టచ్లోకి రాకపోవడం వెనక ఆంతర్యం ఏంటని ఆ పార్టీ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.
రేవంత్ మౌనం.. అనుమానాలకు ఆస్కారం
అమ్మవారిపై ప్రమాణం చేయకపోతే రేవంత్రెడ్డి తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టేనని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నాయకుడు కొత్త మనోహర్రెడ్డి ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రకటించారు. ఆయన మోసాలపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గతంలో మునుగోడు ఎన్నికల్లో రూ.25 కోట్లు తీసుకున్నారని ఈటల చేసిన ఆరోపణలను ఖండించడానికి రేవంత్రెడ్డి అడగకకుండానే చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేశాడని గుర్తు చేశారు. మరి ఇప్పుడు తాను అడుగుతున్నా స్పందన లేదని విమర్శించారు. చారిత్రక చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మనోహర్రెడ్డి.. రేవంత్రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం వందల కోట్లు తీసుకొని ఆయన అనుయాయులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఓ అభ్యర్థి నుంచి రూ.10 కోట్లు, 5 ఎకరాలు తీసుకొని టికెట్ ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు. ఇది నిజం కాకపోతే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఏ తప్పూ చేయలేదని ప్రమాణం చే యాలని డిమాండ్ చేశారు. మనోహర్రెడ్డి చేసి న డిమాండ్ గడువు పూర్తి కావొచ్చినా.. రేవం త్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
నేనే సీఎం.. నీకు మంత్రి పదవి!
కాంగ్రెస్ పార్టీకి 40 ఏండ్లపాటు జీవితం ధారపోసిన వారందరిని పక్కనపెట్టి డబ్బుల ఆశతో కొత్తవారిని పార్టీలోకి రేవంత్ తీసుకొస్తున్నారని మనోహర్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్లో చేరుతున్న కసిరెడ్డి నారాయణరెడ్డి నుంచి రూ.6 కోట్లు తీసుకొని కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తున్నారని ఆరోపించారు. ప్రతి అభ్యర్థి గెలుపోటములపై సర్వే చేసిన తర్వాతే టికెట్ కేటాయిస్తానన్న రేవంత్.. కసిరెడ్డిపై చేసిన సర్వే వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు నుంచి అనిల్కుమార్ అనే వ్యక్తి ఇప్పటికే రేవంత్రెడ్డికి 12 కోట్లు ముడుపులు ఇచ్చినట్టు ప్రచారం కొనసాగుతున్నదని తెలిపారు. ‘రేపు రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. నేను ముఖ్యమంత్రిని కాబోతున్నా. నీకు రెవెన్యూశాఖను కేటాయిస్తా’నని రేవంత్రెడ్డి అనిల్కుమార్కు చెప్పారని, ఈ వివరాలన్ని ఈడీకి అందిస్తామని మనోహర్రెడ్డి వివరించారు. ‘మా నియోజకవర్గంలో చల్ల నర్సింహరెడ్డి లాంటి వ్యక్తిని కాదని వేరే వాళ్లు డబ్బులు ఇస్తున్నారని మొదటి లిస్టులో వారి పేరు పెట్టి పంపిస్తున్నావంటే నీ అహంకారం ఎలాంటదో తెలుస్తుంది’ అని పేర్కొన్నారు. డబ్బులిచ్చే వారికి లైన్ క్లియర్ చేయడం రేవంత్ పని అని.. అందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని పేర్కొన్నారు.