హైదరాబాద్, ఆగస్టు 11, (నమస్తే తెలంగాణ) : తానెంత సొక్కమో వెనక్కి తిరుగుచూసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి టీఆర్ఎస్ నేత, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. గురివింద తన కింద నలుపు తానే ఎరగదన్నట్టు.. బండి సంజయ్ వ్యవహారశైలి ఉన్నదని పేర్కొన్నారు. మూసీ నది ప్రక్షాళన జరుగాలంటే సీఎం కేసీఆర్కు ఆ నీళ్లతో స్నానం చేయించాలంటూ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్రిశాంక్ అంతే ఘాటుగా బదులిచ్చారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం కాశీ (వారణాసి)లో పర్యటించి, పవిత్ర గంగానది ఎంతగా కలుషితమవుతున్నదో కండ్లకు కట్టినట్టు చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాకుండా.. ఆ మురికి జలాలను ఓ బాటిల్లో నింపి దానిని ప్రధానమంత్రి కార్యాలయానికి కొరియర్ ద్వారా పంపించారు. గంగానది ప్రక్షాళనకు రూ.24,500 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రధాని మోదీ స్వయంగా చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. వీడియో క్లిప్పింగ్ను క్రిశాంక్ జతచేశారు.
గంగానది ప్రక్షాళనకు రూ.24,500 కోట్లు ఖర్చుచేసినట్టు ప్రధాని ప్రకటించారని, కానీ కాశీలో మాత్రం డ్రైనేజీ నీటిని నేరుగా పవిత్ర గంగాజలాల్లోకి వదిలేస్తున్నారని క్రిశాంక్ ఆధారాలతో బయటపెట్టారు. మురికికాలువల నీటి ని గంగానదిలోకి వదిలివేయడమేనా ప్రక్షాళనంటే..? అని ఆయన ప్రశ్నించారు. నమామి గంగే పథకం కింద పెట్టిన ఖర్చు ఏమైందని నిలదీశారు. తాను పంపుతున్న గంగాజలాల బాటిల్తో ఏం చేస్తారో… బండి సంజయ్ విచక్షణకే వదిలేస్తున్నట్టు క్రిశాంక్ పేర్కొన్నారు.