హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పదేండ్ల పాలనతో పోల్చుకుంటే మోదీ తొమ్మిదేండ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతిపాలైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్లో అంతులేని భావదారిద్య్రం ఉన్నదని, ఈ విషయం వాళ్లు పార్లమెంటులో కూడా మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. ఆదివారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధామిస్తూ.. మన్మోహన్సింగ్ హయాంతో పోలిస్తే మోదీ హయాంలో వివిధ రంగాల్లో దేశం పరిస్థితి ఎంతగా దిగజారిందో గణాంకాలతో వివరించారు.
కాంగ్రెస్ పాలనలో జీడీపీ వార్షిక వృద్ధిరేటు 6.8% ఉండగా, బీజేపీ హయాంలో 2014-23 వరకు 5.5 శాతానికి దిగజారిందని విమర్శించారు. వృద్ధిరేటు గురించి తాను చెప్పేది కథ కాదని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికని స్పష్టంచేశారు. తలసరి ఆదాయం వృద్ధిరేటు మన్మోహన్ హయాంలో తొమ్మిదేండ్లలో 12.73% ఉండగా, మోదీ తొమ్మిదేండ్ల హయాంలో 7.01 శాతానికి పడిపోయిందని దుయ్యబట్టారు. మోదీ హయాంలో తలసరి ఆదాయం వృద్ధిరేటు సగానికి సగం పడిపోయిందని చెప్పారు.
మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అయిందా?
ఎగుమతుల వృద్ధి రేటు కూడా మోదీ హయాంలో దారుణంగా పడిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఎగుమతుల వృద్ధిరేటు మన్మోహన్ హయాంలో 19.5% ఉండగా, మోదీ హయాంలో అది 4.9 శాతానికి పడిపోయిందని దుయ్యబట్టారు. మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అయిందా? అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. పారిశ్రామిక వార్షిక వృద్ధిరేటు మన్మోహన్సింగ్ హయాంలో 5.87% ఉండగా.. మోదీ హయాంలో అది 3.2 శాతానికి దిగజారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మోదీ చెప్తున్న వృద్ధిరేటు ఎక్కడ పెరిగింది? ఉపన్యాసాల్లో పెరిగిందా? అని నిలదీశారు. వృద్ధిరేటు అదానీ ఆస్తులు పెరిగినట్టు పెరిగిందా? అని ప్రశ్నించారు. మోదీ హయాంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి విలువ పడిపోయిందని దుయ్యబట్టారు. మన్మోహన్సింగ్ హయాంలో డాలర్తో పోల్చితే రూపాయి విలువ 58.6 కాగా, మోదీ హయాంలో అది 82.6 రూపాయలకు పతనమైందని ఆందోళన వ్యక్తంచేశారు. నోరుంది కాబట్టి, మందబలం ఉన్నది కాబట్టి పార్లమెంటులో బీజేపీవాళ్లు చాలా మాటలు మాట్లాడుతారని మండిపడ్డారు.
పెరిగిన అప్పుల శాతం
మన్మోహన్ హయాంలో జీడీపీలో అప్పుల శాతం తగ్గితే.. మోదీ హయాంలో పెరిగిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. జీడీపీలో అప్పుల శాతం (డెబ్ట్ జీడీపీ రేటు) 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు 66.7% ఉండగా, మన్మోహన్ పాలన ముగిసేసరికి అది 52.2 శాతానికి దిగివచ్చిందని గుర్తుచేశారు. దాదాపు 14% తగ్గిందని వివరించారు. ఇంత పెద్ద మాటలు మాట్లాడే మోదీ హయాంలో అప్పుల శాతం 52.2 నుంచి 56.2కు పెరిగిందని చెప్తూ.. ఎవరి మీద ఆయన గీంకారాలు, హూంకారాలు చేస్తున్నారని నిలదీశారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? అని ప్రశ్నించారు. డెబ్ట్ జీడీపీ మోదీ హయాంలో 4శాతం పెరిగిందనేది నగ్నసత్యమని చెప్పారు. క్యాపిటల్ ఎక్స్పెండీచర్, క్యాపిటల్ ఫార్మేషన్లో మన్మోహన్ హయాంలో 37.5% ఉంటే.. మోదీ పాలనలో కేవలం 31% ఉన్నదని, క్యాపిటల్ ఎక్స్పెండీచర్తోపాటు క్యాపిటల్ ఫార్మేషన్ కూడా తగ్గిందని సీఎం కేసీఆర్ వివరించారు. ద్రవ్యలోటు మన్మోహన్సింగ్ హయాంలో 4.77% ఉంటే.. మోదీ హయాంలో అది 5.1 శాతానికి పెరిగిందని విమర్శించారు.