Manipur Violence | హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతున్నది. ఈ నెల 3న చురచంద్పూర్ జిల్లా టోర్బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఐదురోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. హింసాత్మక ఘటనలను నివారించేందుకు పారామిలటరీ బలగాలను సైతం మోహరించింది. అల్లర్లను, ఘర్షణలను కట్టడి చేసేందుకు కనిపిస్తే కాల్చివేతకు గవర్నర్ ఆదేశించారు. ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
మరో వైపు అక్కడ హింసాత్మక ఘటనల నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులు సైతం బిక్కుబిక్కుమంటూ నెట్టుకువస్తున్నారు. ఇంఫాల్ నీట్ సహా పలు విద్యాసంస్థల్లో తెలంగాణ విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగుతున్నారు. ప్రస్తుతం మణిపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులంతా గదులకే పరిమితమవ్వాలని పరిస్థితి నెలకొన్నది. తినేందుకు తిండి సైతం దొరక్క ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పిల్లల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
మణిపూర్లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మణిపూర్లో రాష్ట్రానికి సంబంధించిన 250 మంది విద్యార్థులను విమానం ద్వారా రాష్ట్రానికి తరలించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇంఫాల్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానాన్ని విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి మణిపూర్ సీఎస్తో మాట్లాడారు. మణిపూర్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ సమన్వయం చేస్తూ వస్తున్నారు.
రేపు సాయంత్రం 4 గంటలకు విమానం ఇంఫాల్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానం రానున్నట్లుగా తెలుస్తున్నది. మరో వైపు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. హెల్ప్లైన్ ఇన్చార్జిగా డీఐజీ సుమతిని నియమించినట్లు డీజీపీ తెలిపారు. మణిపూర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మన పౌరులను ఇక్కడికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమున్న వారు హెల్ప్లైన్ 7901643283 నంబర్కు, లేదంటే.. dgp@tspolice.gov.inకు మెయిల్ ద్వారానైనా సంప్రదింవచ్చన్నారు.