హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా మాణిక్రావు ఠాక్రే నియామకం అయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల వాట్సాప్ గ్రూప్ నుంచి ప్రస్తుత ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ ఎగ్జిట్ అయిన కొద్ది గంటలకే.. కొత్త ఇంచార్జిని ప్రకటించింది ఏఐసీసీ. ఇక గోవా ఇంచార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రేకు తెలంగాణ బాధ్యతలు అప్పజెప్పిన ఏఐసీసీ, మాణిక్యం ఠాగూర్కు గోవా బాధ్యతలు కట్టబెట్టింది.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల వ్యవహారంతో.. ఇంచార్జి పదవి నుంచి ఠాగూర్ తప్పుకున్నట్లు మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాణిక్యం ఠాగూర్.. తెలంగాణ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఇంచార్జీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మల్లికార్జున్ ఖర్గేకు ఠాగూర్ లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితులతో రాష్ట్ర కాంగ్రెస్లో నెలకొన్న విభేదాలను చక్కదిద్దేందుకు దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. ఎట్టకేలకు గోవా ఇంచార్జిగా ఉన్న మాణిక్రావును తెలంగాణకు కేటాయించారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల వాట్సాప్ గ్రూప్ నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. టీ కాంగ్రెస్ నేతల గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయింది నిజమే అని ఠాగూర్ స్పష్టం చేశారు. ఏఐసీసీ వాట్సాప్ గ్రూపులో ఠాగూర్ కొనసాగుతున్నట్లు బోసురాజు వెల్లడించారు.