తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు
గతంలో హైకోర్టు తీర్పు కొట్టివేత
50 వేల కోట్ల భూములు ప్రభుత్వపరం
ఏండ్లుగా వక్ఫ్బోర్డుతో వివాదం
ఇప్పటికే పలు సంస్థలకు భూ కేటాయింపులు
విలువైన భూములను రక్షిస్తున్న ప్రభుత్వం
ఏడేండ్లలో అనేక కీలక విజయాలు
హైదరాబాద్/రంగారెడ్డి, ఫిబ్రవరి 7 : మణికొండజాగీర్లోని 1654.32 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందిన భూములేనని సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చిం ది. సంబంధిత భూముల్లో 1,191 ఎకరాలు ప్రభుత్వ భూములుండగా, మిగతావి పట్టా భూములున్నాయి. సుప్రీం తీర్పుతో దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వపరమయ్యాయి. 2007 నుంచి ప్రభుత్వానికి-వక్ఫ్బోర్డుకు మధ్య కోర్టులో వివాదం కొనసాగుతున్నది. ఈ భూములు వక్ఫ్బోర్డుకు చెందినవంటూ 2012లో హైకోర్టు తీర్పును వెలువరించగా, అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పుచెప్పింది. ఈ భూముల్లో వక్ఫ్బోర్డుకు కేవలం 4,800 చదరపు గజాలు మాత్రమే ఉన్నదని స్పష్టంచేసింది. మిగతా భూములకు సంబంధించి వక్ఫ్బోర్డుది బోగస్ దావాగా పేర్కొన్నది. కాగా ఈ భూముల్లో మెజార్టీ భూములను గతంలో ల్యాంకో హిల్స్తోపాటు, ఉర్దూ యూనివర్సిటీ, విప్రో, ఇండియన్ బిజినెస్ స్కూల్, టీఎన్జీవో హౌసింగ్ సోసైటీ, హైదరాబాద్ పబ్లిక్ సర్వీసెస్ కో-ఆపరేటివ్ సోసైటీ తదితరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ-వేలంలో భాగంగా కేటాయించారు. మరోవైపు విలువైన ప్రభుత్వ భూములను కాపాడటంలో కీలకంగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ డీ అమయ్కుమార్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, గండిపేట తాసిల్దార్ రాజశేఖర్ను రాష్ట్ర ప్రభుత్వం అభినందించింది.
భూములకు సర్కారు కావలి!
‘సర్కారు భూములపై ప్రైవేట్ వ్యక్తుల పెత్తనాలను సహించబోం’.. ప్రభుత్వ భూముల కబ్జాలపై సీఎం కేసీఆర్ గతంలో చెప్పిన మాట. కబ్జాకోరల్లో చిక్కుకున్న భూములు, న్యాయ వివాదాల్లో నలుగుతున్న భూములపై సీఎం మొదట్నుంచీ దృష్టి సారించారు. ఓవైపు కబ్జాలను తొలిగింపజేస్తూ.. మరోవైపు ఏండ్ల తరబడి కోర్టుల్లో నలుగుతున్న కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయించి, సమర్థంగా వాదనలు వినిపించేలా చేసి ప్రభుత్వ భూములను కాపాడుతున్నారు. ఫలితంగా ఏడేండ్లలో రూ.వేల కోట్లు విలువ చేసే స్థలాలు ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాయి. తాజాగా మణికొండలో 1654 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టులో విజయం సాధించింది.
11 వేల ఎకరాలపై వివాదాలు..
2015లో సీఎం కేసీఆర్ సమీక్షలు నిర్వహించి, కబ్జాకోరల్లో చిక్కుకున్న, న్యాయవివాదాలున్న భూముల వివరాలు తెప్పించుకొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 11వేల ఎకరాలపై న్యాయవివాదాలు ఉన్నట్టు తేలింది. ప్రభుత్వ భూములపై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం ఉండొద్దని సీఎం కేసీఆర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతి కేసును సమగ్రంగా అవగతం చేసుకోవాలని, సంబంధిత అధికారిక పత్రాలన్నింటినీ సేకరించి, న్యాయస్థానానికి సమర్పించాలన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ప్రముఖ లాయర్లను తీసుకురావాలని సూచించారు. సీఎం మార్గదర్శకత్వంలో రెవెన్యూ యంత్రాంగం కృషివల్ల ఇప్పటివరకు రూ.లక్ష కోట్లకు పైగా విలువైన భూములు కబ్జా నుంచి బయటికి వచ్చినట్టు అంచనా.
దాడులకు, కేసులకు భయపడక..
ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నంలో రెవెన్యూ యంత్రాంగం అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నది. దాడులైనా, కేసులు పెట్టినా వెరవకుండా ముందుకు వెళ్లింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా పరిధిలోని పలు సర్వే నంబర్లలో 69.21 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ భూమిపై కొందరు కన్నేసి తప్పుడు పత్రాలు సృష్టించి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రెవెన్యూ అధికారులు పక్కా ఆధారాలను సమర్పించగా కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తర్వాత 13.17 ఎకరాల భూమిని మరికొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించగా ఎమ్మార్వో గౌతమ్కుమార్ అడ్డుకున్నారు. కబ్జాదారులు ఎమ్మార్వో గౌతమ్కుమార్తోపాటు ఎమ్మెల్యే సుభాష్రెడ్డిపైనా తప్పుడు కేసులు పెట్టారు. అయినా అధికారులు వెనక్కి తగ్గలేదు. గతేడాది ఆగస్టు 12న భూమిని స్వాధీనం చేసుకున్నారు.
కొన్ని కీలక విజయాలు..
* బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని సర్వే నెంబర్ 403లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిపై 30 ఏండ్ల నుంచి వివాదం ఉన్నది. సీఎం ఆదేశాలమేరకు అధికారులు పక్కా ఆధారాలతో వాదనలు వినిపించడంతో 2017 ఆగస్టు 16న సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అప్పట్లో ఆ భూమి విలువ సుమారు రూ.750 కోట్లు.
* రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46 లో 84.3 ఎకరాల ప్రభుత్వ భూమిపై కొందరు వివాదం సృష్టించారు. అధికారులు పక్కా ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 2వ తేదీన కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో సుమారు రూ.5 వేల కోట్ల భూములు ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాయి.
* రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలోని సర్వే నెంబర్ 391/1, 391/20లో ఉన్న 142.39 ఎకరాల భూమిని ఉమ్మడి ఏపీ సర్కారు గ్రేహౌండ్స్కు కేటాయించింది. 20 మంది ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వం ఆ భూమిని తమకు కేటాయించిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్లి విజయం సాధించింది. దీని విలువ రూ.10 వేల కోట్లు.
* కోకాపేటలో హెచ్ఎండీఏకు 630 ఎకరాల ప్రభుత్వ భూమిని 2007లో వేలం ద్వారా అమ్మేసింది. ఆ తర్వాత న్యాయ వివాదం తలెత్తడంతో కొన్నవారు తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయి ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో 2017 అక్టోబర్లో అనుకూలంగా తీర్పు వచ్చింది.
* కూకట్పల్లిలోని సర్వే నంబర్ 1009లో ఉన్న 20 ఎకరాలు తనదేనంటూ ఒక మహిళ కోర్టును ఆశ్రయించింది. హౌజింగ్ బోర్డు సుప్రీంకోర్టుదాకా వెళ్లి విజయం సాధించింది. అప్పట్లోనే దీని విలువ రూ.700 కోట్లు. ఒక్క బంజారాహిల్స్ పరిధిలోనే సుమారు 300కుపైగా స్థలాలను కాపాడి స్వాధీనం చేసుకున్నది.
ముఖ్యమంత్రికి ముందునుంచీ శ్రద్ధ
తెలంగాణ వచ్చాక ప్రభుత్వ భూములకు రక్షణ పెరిగింది. సీఎం కేసీఆర్ కబ్జాలు, న్యాయవివాదాలపై ప్రత్యేక దృష్టిసారించారు. అన్నింటినీ విడిపించాలని ఆదేశించారు. కేసుల హియరింగ్, కౌంటర్ ఫైల్ చేయడం వంటివన్నీ కచ్చితంగా ఫాలో కావాలన్నారు. రెవెన్యూ యంత్రాంగం సుప్రీంకోర్టులో పక్కా ఆధారాలు సమర్పిస్తుండటంతో తీర్పులు అనుకూలంగా వస్తున్నాయి.
– చంద్రకళ, ఆర్డీవో, రాజేంద్రనగర్