హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): సభా హక్కుల ఉల్లంఘన కింద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాకూర్ మంగళవారం రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో తన గురించి అనుచితంగా మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
లోక్సభ సభ్యుడి గురించి రాజ్యసభలో మాట్లాడటం సభాహక్కుల కిందకు వస్తుందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది మోదీ అని, ఆ హామీ గురించి మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పార్లమెంట్లో 2019 నుంచి అన్ని బిల్లులు జగన్ మద్దతుతోనే ఆమోదం పొందాయని తెలిపారు. సీబీఐ కేసుల కోసమే బీజేపీకి లొంగిపోయారని ఆరోపించారు.