హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాజకీయా ల్లో వైసీపీ, టీడీపీ రెండూ దొందూ దొందేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించా రు. ఆ రెండు పార్టీలు బీజేపీ తొత్తులేనని ఆరోపించారు. ఆదివారం విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్సార్ ఆశయాలు ఒక కాంగ్రెస్లోనే నెరవేరాయని, ఆయన బిడ్డతో చేతులు కలపాలని, ఆంధ్రలో మళ్లీ వైఎస్సార్ ఆశయాలను సిద్ధింపజేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, మతం పేరుతో చిచ్చు పెట్టి, చలి కాచుకోవాలనేదే ఆ పార్టీ మంత్రమని విమర్శించారు. జగన్రెడ్డి క్రైస్తవుడైనప్పటికీ మణిపూర్ ఘటనపై స్పందించనేలేదని మండిపడ్డారు. టీడీపీ సైతం అదే వైఖరితో ఉన్నదని, బీజేపీకి వైఎస్సార్ వ్యతిరేకి అని గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను పాలకులు తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు. వైఎస్ షర్మిల సమక్షంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితోపాటు ఆయన అనుచరులు కాంగ్రెస్లో చేరారు. అంతకు ముందు షర్మిల ర్యాలీగా విజయవాడ పార్టీ కార్యాలయానికి బయలుదేరగా.. ఆమె కాన్వాయ్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏం సార్ .. భయపడ్డారా? అని ఏపీ సీఎం జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.