ఇరిగేషన్, టూరిజం అధికారులతో మంత్రి గంగుల
హైదరాబాద్, నవంబర్6 (నమస్తే తెలంగాణ) : మానేరు తీరాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రివర్ ఫ్రంట్ పనులకు వర్క్ క్యాలెండర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనుల పురోగతిపై టూరిజం, ఇరిగేషన్, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్ జలసౌధలో శనివారం మంత్రి సమావేశమయ్యారు. డీపీఆర్ ఫైనలైజేషన్, రిటైనింగ్ వాల్ తుది డిజైన్లు, భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించిన మంత్రి కొన్ని అంశాలపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ముంపును తగ్గిస్తూ, రివర్ ఫ్రంట్ అందాలు ద్విగుణీకృతం అయ్యేలా ప్రతిపాదించిన హాఫ్బరాజ్, హాఫ్ వీర్ నమూనాలకు అంగీకారం తెలిపారు. అనంతరం గంగుల మాట్లాడుతూ.. ప్రాజక్టులో అంతర్భాగంగా చేపట్టిన తీగల వంతెన నిర్మాణం పూర్తయిందని చెప్పారు. సమావేశంలో సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీలు మురళీధర్, శంకర్, టూరిజంశాఖ ఈడీ శంకర్రెడ్డి, టీఎస్ టీడీసీ సీఈ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.