ఖైరతాబాద్, ఏప్రిల్ 2: రాష్ట్రంలో 70 లక్షల మంది మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక్క లోక్సభ స్థానం కూడా కేటాయించకుండా మాదిగల వ్యతిరేక పార్టీగా మారిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు సైతం కాంగ్రెస్ అన్యాయం చేసిందని, కేవలం రెండు సీట్లకే పరిమితం చేసిందని విమర్శించారు. ఐదు శాతం జనాభా కూడా లేని సీఎం రేవంత్రెడ్డి సామాజికవర్గానికి మాత్రం 50 శాతం టికెట్లు కేటాయించుకున్నారని ఆరోపించారు.
మాదిగలు, బీసీలకు సీట్ల విషయంలో చేసిన అన్యాయంపై బుధవారం నుంచి 10 రోజులపాటు గ్రామ స్థాయి నుంచి పట్టణాలు, నగరాల్లో మాదిగలంతా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, తమతోపాటు బీసీల ను కలుపుకొని పోతామని తెలిపారు. వరంగల్, పెద్దపల్లి, నాగర్కర్నూల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో 15 లక్షల మంది ఉన్న మాలలకు రెండు, ఒక్క శాతం మంది ఉన్న బైండ్ల కులానికి ఒకటి కేటాయించారని, దీంతో కాంగ్రెస్కు మాదిగలతో తెగతెంపులు జరిగినట్టేనని స్పష్టం చేశారు.
వరంగల్ స్థానాన్ని అయినా మాదిగలకు ఇస్తారనుకుంటే బైండ్ల సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తెకు ఇవ్వడం మరింత బాధించిందని తెలిపారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారితే కష్టకాలంలో పార్టీలు మారడం సిగ్గుచేటని, ఎవరైనా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారితే రాళ్లతో కొట్టండని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడిన రేవంత్రెడ్డి నేడు బీఆర్ఎస్ కష్టకాలం లో ఉన్నప్పుడు కడియం శ్రీహరిని ఎందు కు చేర్చుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.