బొడ్రాయిబజార్, ఏప్రిల్ 11 : తెలంగాణలో మెజార్టీ శాతం ఉన్న మాదిగలను విస్మరించిన కాంగ్రెస్కు మాదిగలను ఓట్లు అడిగే హక్కు లేదని, ఓట్ల కోసం మాదిగ పల్లెలకు వస్తే తరిమి కొడుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. మాదిగల ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.
కాంగ్రెస్ చర్యలతో మాదిగల్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్నదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో మాదిగలకు అవకాశం ఇవ్వాలని, ప్రకటించిన స్థానాలను మార్చి రెండు పార్లమెంట్ సీట్లతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటును మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకు పెద్దపీట వేస్తున్నదని విమర్శించారు. మాదిగ కోటా కింద దామోదర రాజనర్సింహకు మంత్రి పదవి ఇచ్చి విలువ లేకుండా చేశారని మండిపడ్డారు.
ఇటీవల బాబుజగ్జీవన్రామ్ భవన ప్రారంభ ఆహ్వాన పత్రికలో రాజనర్సింహ పేరే లేదని తెలిపారు. సమాన వాటా అడిగితే తమను బీజేపీ మనుషులంటున్నారని, జగ్గారెడ్డి మొదలు ఏ పార్టో గుర్తు చేసుకోవాలని సూచించారు. తమ ఓట్లతో నాయకుడిగా ఎదిగిన రేవంత్రెడ్డి మాదిగలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మాల కావడం వల్లే మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.