Mandakrishna Madiga | హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలను ప్రోత్సహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. సిగ్గు లేని కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి ఎలా తీసుకుంటావ్ అని రేవంత్ను మందకృష్ణ నిలదీశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాట్లాడారు.
పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారుతుంటే 75 ఏండ్ల వయసులో పార్టీ మారడం ఏంటి..? ఆయన సిగ్గులేనోడు అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మందకృష్ణ గుర్తు చేశారు. మరి ఇప్పుడు అదే 75 ఏండ్ల కడియం శ్రీహరి పార్టీలోకి వస్తుంటే రేవంత్ రెడ్డి ఆ సిగ్గులేనోడిని ఎలా పక్కన కూర్చోబెట్టుకున్నాడు..? ఎలా పార్టీలోకి తీసుకున్నాడు..? అని మందకృష్ణ ప్రశ్నించారు.
ఇక బీఆర్ఎస్ కడియం శ్రీహరికి అన్ని పదవులు ఇచ్చింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీతో పాటు చివరకు డిప్యూటీ సీఎంను కూడా చేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ పొన్నాల లక్ష్మయ్యను డిప్యూటీ సీఎం కూడా చేయలేదు. కానీ కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని మందకృష్ణ తెలిపారు.