వెల్గటూర్, జూలై 24 : గల్ఫ్లో చిక్కుకుపోయిన తన కొడుకును ఇండియాకు రప్పించాలని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాత గూడూరుకు చెందిన కొపర్తి అభిలాష్ తల్లి సుమలత రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నది. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఓ గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా టూరిస్ట్ వీసాపై జూలై 8న అభిలాష్ అబుదాబికి వెళ్లాడు. ఈ నెల 13న అభిలాష్కు ఎంప్లాయిమెంట్ వీసా జారీ అయింది. అదే సమయంలో భారత సైన్యం నిర్వహించే ‘అగ్నివీర్’ రిక్రూట్ మెంట్ ర్యాలీలో ఫిజికల్ స్రీనింగ్కు అతడు ఎంపికైనట్టు ఈ నెల 14న ఈ-మెయిల్ అందింది. ప్రస్తుతం అభిలాష్ పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం అతడిని పంపించేందుకు షరతు విధించింది. రూ.1.08 లక్షలు జరిమానా చెల్లించి, ఎంప్లాయిమెంట్ వీసా రద్దు చేశాకే అతడిని భారత్కు పంపిస్తామని స్పష్టం చేసింది.
ఎలాగైనా తన బిడ్డను అబుదాబి నుంచి స్వదేశానికి రప్పించాలని కోరుతూ హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో సుమలత వినతిపత్రం సమర్పించింది. స్టేట్ నోడల్ ఆఫీసర్ విద్యాసాగర్ను కలిసి తన కొడుకు సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న కల నెరవేరేలా చేయాలని విజ్ఞప్తి చేసింది. వెంటనే స్పందించిన ఆయన, అత్యవసరంగా స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జీఏడీ)కి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి బాధిత కుటుంబానికి మార్గనిర్దేశం చేశారు. ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ హెల్ప్ డెస్ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వలంటీర్ గంగుల మురళీధర్రెడ్డి.. సుమలతకు బాసటగా నిలిచారు.