ఖైరతాబాద్, ఏప్రిల్ 24: ముఖ్యమంత్రి పదవికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పనికిరారా? అని సీఎం రేవంత్రెడ్డిని ఎమ్మార్పీఎస్ వ్య వస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మా ట్లాడారు. ఒక సీఎం దిగిపోతే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వారే సీఎం అవుతారని, భట్టి విక్రమార్క దళితుడైనందు వల్లే సీఎంగా పనికిరారన్నది ఆయన భావనలా కనిపిస్తున్నదని ఆరోపించారు. మంత్రి వెంకట్రెడ్డి సీఎం అవుతారన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలే ఆయనలో ఉన్న కులతత్వ పోకడలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆదివాసీ అయిన మంత్రి సీతక్క, దళితుడైన మరో మంత్రి రాజనర్సింహా, బీసీ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పేర్లు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.
వారందరూ సీఎం రేవంత్రెడ్డి కంటే ముందే అర్హులని, కాంగ్రెస్ను ఆయనే గెలిపించాడన్న భ్రమలో ఆ పార్టీ అధిష్ఠానం రేవంత్ను సీఎం ను చేసిందని చెప్పారు. రేవంత్రెడ్డి కులతత్వ వైఖరితో కాంగ్రెస్ పార్టీకి ఇతర అన్ని సామాజికవర్గాలను దూరం చేస్తున్నారని విమర్శించారు. ముగ్గురు మంత్రులతోపాటు 17 మంది తన సామాజికవర్గం వారిని కీలక అధికారులుగా నియమించుకున్నారని ఆరోపించారు. ఏకంగా 14 కార్పొరేషన్ చైర్మన్ పదవులను సైతం సొంత సామాజికవర్గానికి ముట్టజెప్పారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకు దక్కాల్సిన నిజామబాద్, భువనగిరి, నల్లగొండ, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్నగర్ లోక్సభ స్థానాలను జీవన్రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డి, రఘువీర్రెడ్డి, ప ట్నం సునీతారెడ్డి, రంజిత్రెడ్డి, వంశీచందర్రెడ్డికి ఇప్పించుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం లో సీఎం సామాజికవర్గ పాలన సాగుతున్నదని విమర్శించారు. సీఎం కులతత్వ వైఖరిపై సాక్ష్యాలు, రుజువులు తన వద్ద ఉన్నాయని, చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
మాదిగలకు కాంగ్రెస్ మోసం
తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 24: ఎంపీ టికెట్, నామినేటెడ్ పదవులు మాదిగలకు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాదిగ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తిమ్మన నవీన్రాజు మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు వైఖరికి నిరసనగా గన్పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద బుధవారం మాదిగ రాజ్యాధికార పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాదిగల ఆత్మగౌరవ బస్సు యాత్రను ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు ఎం కోటేశ్వరరావు, జగదీశ్ మాదిగ, అమృత్, ప్రవీణ్ జయరాజ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.