ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 5: రాష్ట్రంలో రేవంత్రెడ్డి హయాంలోనే మాదిగలకు మరింత మోసం జరుగుతున్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా రేవంత్రెడ్డి నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. పార్సిగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో గురువారం విలేకరులతో మందకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో మూడు లోక్సభ స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ కాగా, వాటిలో ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించకుండా అన్యాయం చేశారని గుర్తుచేశారు.
ఇటీవల అయిదు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయగా, మాలలకు ఒకటి, ఎస్టీలకు ఒకటి ఇచ్చి మాదిగలకు మాత్రం ఇవ్వలేదని చెప్పారు. తాజాగా రాజ్యసభ సీట్లలోనూ మాదిగ జాతికి ద్రోహం చేశారని దుయ్యబట్టారు. పార్లమెంట్లో మాదిగలకు ప్రాతినిధ్యం లేని సందర్భం ఈ రేవంత్రెడ్డి హయాంలోనే ఎదురైందని పేర్కొన్నారు. రేవంత్ వైఖరికి నిరసనగా ఈ నెల 13న అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు నల్లజెండాలతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని మందకృష్ణ పిలుపునిచ్చారు.