Premsagar Rao | మంత్రి పదవి విషయంలో ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా నోరువిప్పాడు. మంత్రి పదవి విషయంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
మంత్రివర్గంలో నాకు చోటు లేకుంటే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసినట్టే అని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై ప్రేమ్సాగర్ రావు మండిపడ్డారు. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన నాకే అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు కావాలా? పదేళ్లు పార్టీని కాపాడుకుంటే ఇదేనా మాకిచ్చే గౌరవమని నిలదీశారు. ఇంద్రవెల్లి సభతో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోశానని అన్నారు.
మంత్రి పదవి విషయంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అధిష్ఠానం మంత్రిపదవి ఇస్తానంటుంటే.. సీనియర్నేత జానారెడ్డి అడ్డం పడుతున్నారని ఆరోపించారు. ధర్మరాజులా ఉండాల్సిన వ్యక్తి.. ధ్రుతరాష్ర్టుడిలా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అధిష్ఠానానికి జానారెడ్డి రాసిన లేఖపైనా రాజ్గోపాల్రెడ్డి మండిపడ్డారు. 30 ఏండ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలనే విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. భారత క్రికెట్ జట్టులో ఒక ఇంట్లో నుంచి ఇద్దరు క్రికెటర్లు ఉన్నట్టే… మంత్రివర్గంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మంత్రులుంటే తప్పా? ప్రశ్నించారు. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదని, కెపాసిటీతో వస్తుందని చెప్పారు. చం డూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గంలోనూ రాజగోపాల్రెడ్డి మంత్రి పదవిపై వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇచ్చే సమయంలో జానారెడ్డి అధిష్ఠానానికి లెటర్ పెట్టడంతో ప్రక్రియ మళ్లీ మొదటకు వచ్చిందని అసంతృప్తి వ్యక్తంచేశారు.