Congress | హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వడం లేదని, ఎవరికి వారు పంచుకోవడమే ఉన్నదని ఓయూ విద్యార్థి నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లకు, డబ్బులు ఉన్నొళ్లకే టికెట్ దక్కుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పునాదులు కదులుతున్నాయని, పార్టీ అసలు కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్గా మారిపోయిందని అన్నారు. పార్టీ కోసం 23 ఏండ్లుగా పని చేస్తున్న తనకు కాదని, నిన్న మొన్న పార్టీలో చేరిన మట్టా రాజమయికి సత్తుపల్లి టికెట్ కేటాయించడం దారుణమని మండిపడ్డారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సత్తుపల్లిలో రెబల్గా బరిలో దిగుతానని, ఈ నెల 9 లేదా 10న నామినేషన్ వేస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీపై తన ఆగ్రహాన్ని, ఆవేదనను మానవతారాయ్ ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
ఓయూ నుంచి ఎన్ఎస్యూఐ ద్వారా పెద్ద ఎత్తున నిరుద్యోగుల సమస్యపై పోరాటం చేసి ఇప్పుడు తానే శాశ్వత నిరుద్యోగిగా మిగిలిపోయానని మానవతారాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన వారికే న్యాయం చేయలేని కాంగ్రెస్ ఇక నిరుద్యోగులకు ఏం న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. పార్టీ కోసం సర్వస్వం కోల్పోయానని, తన భార్య నగలు తాకట్టు పెట్టి పార్టీ కోసం పని చేశానని పేర్కొన్నారు. ‘పార్టీ కోసం పని చేయండి.. న్యాయం జరుగుతుంది’ అని స్వయంగా రాహుల్గాంధీనే గతంలో హామీ ఇచ్చారని, మరి ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.
ఖమ్మం జిల్లాలో పొంగులేటి, భట్టి విక్రమార్క, రేణుకాచౌదరి ఎవరికి వారు టికెట్లు పంచుకున్నారని మానవతారాయ్ ఆరోపించారు. కాంగ్రెస్ తన సహజత్వాన్ని కోల్పోతుందని, పార్టీ పునాదులు కదులుతున్నాయని, ఇది పార్టీకి ప్రమాద ఘంటికలని అన్నారు.