హైదరాబాద్, మే28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన విప్లవాత్మక దళితబంధు పథకం ద్వారా దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళితుల సంక్షేమంపై ప్రముఖ జర్నలిస్టు వాశిరాజు ప్రకాశం రూపొందించిన ‘మానవతా పరిమళం’ అనే 30 నిమిషాల డాక్యుమెంటరీని హైదరాబాద్ ప్రెస్క్లబ్లో శనివారం మంత్రి మహమూద్ అలీతో కలిసి కొప్పుల ఈశ్వర్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం 80 ఏండ్ల వయసులో ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ‘మానవతా పరిమళం’ డాక్యుమెంటరీని రూపొందించడం ప్రశంసనీయమని అన్నారు.
మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలో మత సామరస్యం వర్ధిల్లుతున్నదని, గంగా-జమున తహజీబ్కు రాష్ట్రం నిలువుటద్దమని అన్నారు. శాంతిభద్రతలు, రాజకీయ సుస్థిరత కారణంగా దేశవిదేశాల నుంచి పెట్టుబడులు తరలివస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ.. ప్రకాశం 50 ఏండ్ల కిందటే ‘కాలం మారింది’ అనే డాక్యుమెంటరీ తీసి జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆయన రూపొందించిన ‘మానవతా పరిమళం’ తెలుగులోనే కాక పలు భారతీయ భాషల్లో విడుదలైందని, విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం డాక్యుమెంటరీకి సంబంధించిన బ్రోచర్ను మంత్రులు ఆవిషరించి నిర్మాత ప్రకాశంను, డైరెక్టర్ పద్మను అభినందించారు.