హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): దేశ ప్రయోజనాల కోసం నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వాలు రావాలని అంబేద్కర్ ఆశించారని, సీఎం కేసీఆర్ ఆ పాలనను అందిస్తున్నారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. వెలివేసిన దళితులను చట్టసభలకు తీసుకొచ్చిన దార్శనికుడు కేసీఆర్ అని, ఆయన అభినవ అంబేద్కర్ అని కొనియాడారు. మోదీ పాలనలో దేశంలో దళిత సంక్షోభం ఉంటే, తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలో దళిత సంక్షేమం సాగుతున్నదని అన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రసమయి మాట్లాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానంతో కేసీఆర్ దళితోద్ధరణ చేస్తున్నారని చెప్పారు. దేశంలో దళితులు సగౌరవంగా బతుకుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టంచేశారు. దళితుల బతుకులు మారుతుంటే జీర్ణించుకోలేని వాళ్లే.. దళితబంధును వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణలో ఒక్క ఎస్సీ స్టడీ సర్కిల్ ఉంటే, ఇప్పుడు 10 స్టడీ సెంటర్లు ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణలో 268 ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయని, ఇన్ని దేశంలో ఎక్కడా లేవని చెప్పారు. దళిత పిల్లలు రూ.20 లక్షల సాయంతో ప్రపంచ దేశాల్లో చదువుతున్నారని తెలిపారు.
గిరిజనగూడేల పరిస్థితి మారిపోయిందని, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు బాగా తెలుసని రసమయి చెప్పారు. కూతురు పెండ్లి చేయలేక దేవుడిని అప్పగించిన తల్లిదండ్రులు తెలంగాణలో ఉన్నారని, తన మేనత్తను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. కానీ, కల్యాణలక్ష్మితో అటువంటి వాళ్ల బతుకులను కేసీఆర్ మార్చేశారని చెప్పారు. ఒకప్పుడు దళిత గర్భిణులు తిండిలేక అలమటించేటోళ్లని, కానీ ఇవాళ న్యూట్రిషన్ కిట్తో ఆ పరిస్థితి మారిపోయిందని గుర్తుచేశారు. దళితవాడల్లో మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంటినీ పలుకరిస్తున్నాయని తెలిపారు. గుజరాత్లోని దేశంలోనే అతిపెద్ద స్టేడియానికి, చివరికి పార్లమెంట్కు కూడా అంబేద్కర్ పేరు పెట్టడానికి మోదీకి మనసు రాలేదన్నారు. కానీ తెలంగాణలో అసెంబ్లీకి అంబేద్కర్ పేరు పెట్టారని తెలిపారు. దేశంలో రామరాజ్యమని చెప్తూ దళితులను తెగ నరుకుతున్నారని మండిపడ్డారు. అసలైన రామరాజ్యం అంటే ఎలా ఉంటుందో తెలియాలంటే తెలంగాణకు రావాలని, కేసీఆర్ పాలన చూడాలని సూచించారు.
ఓ మహాత్మా పూలే మిమ్మల్ని చూడలేదు.. ఓ అంబేద్కరా మిమ్మల్ని మేము చూడలేదు. మీ ఆలోచనలు చూశాం. మీ ఆశయాలను చదివాం.. మీ ఆలోచనలు, మీ ఆశయాల కలబోతగా మీరు కలలు కన్న సమసమాజాన్ని సాధించాలన్న అకుంఠిత దీక్ష కలిగిన కేసీఆర్ను చూశాం. దళిత సమాజం ఆత్మగౌరవంతో జీవించే దళిత సమాజాన్ని చూస్తున్నాం. నిండు పున్నమి చంద్రుని పాలనలో అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు చూస్తున్నాం. ఓ దళిత బిడ్డగా ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది’ అని రసమయి తన ప్రసంగాన్ని ముగించారు.