హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను త్వరలో నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. విద్యాశాఖలో పెండింగ్లో ఉన్న సమస్యలు, టీచర్ పోస్టుల భర్తీ, ‘మన ఊరు మన బడి మన బస్తీ మన బడి’ కార్యక్రమంపై చర్చించేందుకు శుక్రవారం ఎంసీఆర్హెచ్చార్డీలో మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నారు. వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. తర్వాత డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. ఆయా పోస్టుల సంఖ్యపై పూర్తి వివరాలు సమర్పించాలని సూచించారు. నిరుడు జూన్ 12న టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రివర్గ నిర్ణయంతో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నోటిఫికేషన్ను విడుదల చేయడంపై కసరత్తును ముమ్మరం చేశారు.
‘మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి’ కార్యక్రమంపై మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘంగా చర్చించింది. మొదటి విడత పనులు ప్రస్తుతం కొనసాగుతుండగా ఆయా పనుల పరోగతిపై ఉపసంఘం సమీక్షించింది. ఆ పనులను పూర్తిచేసి, సెప్టెంబర్లో రెండో విడత చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ శ్రీధర్రెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఓయూ వీసీ రవీందర్ పాల్గొన్నారు.