హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా సర్కారు బడుల స్వరూపాన్ని సమూలంగా మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం త్వరలో 3.41 లక్షల డ్యూయల్ డెస్క్(బల్ల)లు అందజేయనున్నది. మరో 1.39 లక్షల గ్రీన్చాక్పీస్ బోర్డులను కూడా అందించనున్నది. టీచర్లు, గ్రంథాలయాలు, సైన్స్ల్యాబ్లకు అవసరమయ్యే 4.96 లక్షల కుర్చీలు, టేబుళ్లు, స్టూళ్లు వంటి ఫర్నీచర్ను సేకరించనున్నది.
వీటికోసం తెలంగాణ విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) మూడు రకాల టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 23 వరకు టెండర్ల దాఖలుకు గడువు విధించారు. తరగతులను బట్టి నాలుగు రకాల డ్యూయల్ డెస్క్లను తయారు చేయించనున్నట్టు మార్గదర్శకాల్లో వెల్లడించారు. విద్యార్థుల వయస్సును బట్టి, చిన్నవాళ్లకు చిన్నవి, పెద్దవాళ్లకు పెద్ద సైజులో ప్రత్యేకంగా తయారు చేయాలని టెండర్ల మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు.
మొత్తం 12 అంశాలను తీసుకొని బడులను అభివృద్ధి చేస్తుండగా, నాలుగు రకాల పనులకు అవసరమైన వస్తు సామగ్రిని బల్క్గా రాష్ట్రస్థాయిలో సేకరించాలని గతంలోనే నిర్ణయించారు. ఇలా డ్యూయల్ డెస్క్లు, ఫర్నీచర్, గ్రీన్ చాక్పీస్ బోర్డులను బల్క్గా సేకరించాల్సి ఉంది. మూడేండ్లలో మొత్తం మూడు విడుతల్లో ఈ కార్యక్రమం అమలుకానుండగా, ప్రస్తుతానికి తొలి విడుత పనులు కొనసాగుతున్నాయి. అయితే మూడు సార్లు టెండర్లు పిలిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశముండటంతో మూడు విడుతలకు ఒకే టెండర్ను ఆహ్వానించారు.