హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): మన ఊరు- మన బడి అద్భుతమైన కార్యక్రమని, దీని ద్వారా విద్యారంగానికి మహర్దశ పట్టనున్నదని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా ప్రశంసించారు. ఒక్కో రంగాన్ని ఎంచుకొని అభివృద్ధిబాట పట్టిస్తున్న సీఎం కేసీఆర్ విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రూ.7,289 కోట్లతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం గొప్ప విషయం తెలిపారు. పోటీ ప్రపంచంలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను దీటుగా నిలబెట్టేందుకు పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చడం, ప్రైవేటులో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని నిర్ణయించడం హర్షణీయమని గురువారం పేర్కొన్నారు.
హిమాయత్నగర్, జనవరి 20: రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టాన్ని తీసుకురావాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. గురువారం హైదర్గూడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళ, ఫారెస్ట్ యూనివర్సిటీల ఏర్పాటుతోపాటు ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి, విద్యాబోధన, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లోని ఖాళీ పోస్టులను నింపాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నాయకులు శ్రీహరి, శ్రీశైలం, జీవన్, సురేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు, డిజిటలైజేషన్ కోసం సర్కారు రూ.7,269 కోట్లు కేటాయించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి స్వాగతించారు. ఈ మొత్తాన్ని నిర్దేశిత సమయంలోగా ఖర్చుచేసి పాఠశాలలను అభివృద్ధి చేయాలని గురువారం కోరారు. అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం మంచిదేనని, అదే సమయంలో విద్యార్థులకు మాతృభాష దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని కోరారు.