హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని రాజమండ్రిలో వందేభారత్ రైలెక్కి సరదాగా సెల్ఫీ తీసుకొందామనుకొన్న ఓ వ్యక్తి.. రైలు డోర్లు లాక్ అవడంతో విజయవాడ దాకా ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేగాక, జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. రాజమండ్రిలో వందేభారత్ రైలు ఆగింది. వెంటనే ఓ వ్యక్తి సెల్ఫీకోసం రైలెక్కాడు. ఈలోపు డోర్లు లాక్ అయిపోయాయి. అంతే, అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. టీసీ వచ్చి టికెట్ అడిగేసరికి అసలు విషయం బయటపెట్టాడు. తాను ఫొటోల కోసం ట్రైన్ ఎక్కానని, డోర్లు ఆటోమేటిక్గా లాక్ అవుతాయనే విషయం తెలియదన్నాడు. తాను కూడా ఏమీచేయలేనని, వచ్చే స్టేషన్ వరకు ఆగాల్సిందేనని టీసీ చెప్పారు. దాంతో పాటు టికెట్ లేనందుకు జరిమానా కూడా విధించారు. ఇక చేసేది లేక అతడు ఫైన్ చెల్లించాడు. రాజమండ్రిలో ట్రైన్ ఎక్కినవాడు చివరకు విజయవాడలో దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.