హైదరాబాద్, (నమస్తే తెలంగాణ)/అయిజ, మే 23: తుంగభద్ర నదిలో వరద ఉద్ధృతికి వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ శివారులోని నాగల్దిన్నె వంతెన సమీపంలో చోటుచేసుకున్నది. ఏపీలోని కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ మండలం దైవందిన్నెకు చెందిన ఏడుగురు పులికల్కు ఆదివారం మధ్యాహ్నం చేరుకొన్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో నది దాటేందుకు ప్రయత్నిస్తుండగా కురువ సురేశ్ (26), బోయ రామకృష్ణ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు. రామకృష్ణ ఈదుకొంటూ పాత బ్రిడ్జి పిల్లర్లపైకి చేరుకొని ప్రాణాలు కాపాడుకొన్నాడు. సోమవారం మధ్యాహ్నం సురేశ్ మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు.