ఇసుక లారీల దండు మధ్యన దారిలేక, దాటలేక ఓ రోగి ప్రాణాలు కోల్పోయాడు. మణుగూరు ఏడూళ్లబయ్యారం మార్గంలో వందలాదిగా నిలిచిన లారీలతో అంబులెన్స్ ఆగిపోయింది. చివరికి రెండు కిలోమీటర్ల దూరం భుజాలపైనే రోగిని తరలించేందుకు బంధువులు ప్రయత్నించారు. ఇసుక లారీలను దాటేలోపే వంశీ ప్రాణం కడతేరిపోయింది.
మణుగూరు టౌన్, జూన్ 22 : కనీసం అంబులెన్స్ వెళ్లేందుకూ మార్గంలేని కారణంగా ఓ వ్యక్తి ఊపిరి అనంతవాయువుల్లో కలిసిన ఘటన భద్రాద్రి జిల్లా మణుగూరులో సోమవారం చోటుచేసుకున్నది. ఇసుక లోడింగ్, ట్రాన్స్పోర్టు కోసం స్థానిక గోదావరి ఇసుక ర్యాంపుల వద్దకు వచ్చి వెళ్లే భారీ లారీలు మణుగూరు ఏడూళ్లబయ్యారం మార్గంలో దండు కడుతున్నాయి. రోడ్డు మధ్యన కనీసం మనుషులు నడిచి వెళ్లేందుకు వీల్లేనంతగా రోడ్డుపై నిలిచి ఉంటున్నాయి. ‘నమస్తే తెలంగాణ’ సహా వివిధ మాధ్యమాలు ఈ సమస్యను వెలుగులోకి తెచ్చినప్పటికీ ప్రభుత్వం, యంత్రాంగం స్పందించలేదు. గంటలతరబడి వేచి ఉంటేగానీ కిలో మీటరు దూరాన్ని దాటి వెళ్లలేని పరిస్థితి. అంబులెన్సుల్లోని రోగులతోపాటు ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులదీ అదే దయనీయ స్థితి. తాజాగా చోటుచేసుకున్న విషాదకర ఘటన.. ఇసుక లారీల దండు వల్ల ప్రజల ప్రాణాలకు ఎంతటి ముప్పు ఉందో కండ్లకు కట్టింది.
మణుగూరు మండలంలోని దమ్మక్కపేటకు చెందిన కొమరం వంశీ (33) కుటుంబకలహాల నేపథ్యంలో సోమవారం పురుగులమందు తాగాడు. గమనించిన అతడి కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా అతడిని మణుగూరు దవాఖానకు తరలిస్తున్నారు. అప్పటికే ఏడూళ్లబయ్యారం మణుగూరు మార్గంలో సాంబాయిగూడెం నుంచి రామానుజవరం రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు కూడా ఆ ట్రాఫిక్లోనే చిక్కుకొని ఉన్నాయి. అదే సమయంలో వంశీని తరలిస్తున్న అంబులెన్స్ వచ్చింది. రెండు కిలోమీటర్లమేర నిలిచి ఉన్న ఇసుక లారీలను దాటడం వీలుకాకపోవడంతో వంశీ కుటుంబసభ్యులు అతడిని తమ భుజాలపై మోసుకుంటూ ఇసుక లారీలను దాటారు. అక్కడ మరో వాహనం ఎక్కించుకొని దవాఖానకు తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించి వంశీ మృతిచెందాడని, అరగంట ముందైనా తీసుకొచ్చి ఉంటే బతికేవాడని వైద్యులు తెలిపారు. దీంతో అతడి కుటుంబసభ్యులు భోరున విలపించారు. రహదారిపై నిలిచిన ఇసుక లారీలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.