ఖిలావరంగల్, మార్చి 16: కాజీపేట – వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య శాయంపేట రైల్వే గేటు సమయంలో రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మరణించారు.
జీఅర్పీ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో కిలోమీటర్ నం.372/2A–4A డౌన్ లైన్ వద్ద కాజీపేట నుంచి వరంగల్ దిశగా వెళ్తున్న సింహపురి ఎక్స్ప్రెస్ రైలు నుంచి సుమారు 35 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనను గమనించిన రైల్వే గేట్మన్ వెంటనే ఇచ్చిన సమాచారం మేరకు 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలతో పడి ఉన్న అతడిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతుడు ఎత్తు సుమారు 5 అడుగులు 8 అంగుళాలు, ఛామనఛాయ రంగు కలిగి బ్లాక్ కలర్ నైట్ ప్యాంట్, ఎల్లో కలర్ టీ షర్ట్ ధరించి ఉన్నాడు. మృతుని వద్ద ఈనెల 15వ తేదీన RTC ఎక్స్ రోడ్ నుంచి సికింద్రాబాద్ వరకు బస్ టికెట్, సప్తగిరి సినిమా థియేటర్ సినిమా టికెట్ తప్ప మరి ఇతర ఆధారాలు లభించలేదు. రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం దవాఖాన మార్చురీలో భద్రపరిచి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్ కానిస్టేబుల్ పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 98497 49220, 8712658627 నంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు.