మల్యాల, జనవరి 10 : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు(Kondagattu temple) ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లోని హుండీ( Hundi)నగదు లెక్కిస్తున్న క్రమంలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. హుండీ నగదును తస్కరిస్తుండగా గమనించిన భక్తుడు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అతడిని పట్టుకుని మల్యాల పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. ఆంజనేయస్వామి ఆలయంలో హుండీలను విప్పి ఆలయ వ్రత మండపంలో బుధవారం లెక్కిస్తున్నారు.
ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటున్న క్రమంలో నగదును లెక్కిస్తున్న ఓ వ్యక్తి లోదుస్తుల్లో పెట్టుకుంటున్నట్లు గమనించాడు. దీంతో ఆ భక్తుడు అక్కడే ఉన్న ఏఎస్ఐ చిలుక శ్రీనివాస్, దేవాదాయ ధర్మాధాయశాఖ సహాయ కమిషనర్ చంద్రశేఖర్, ఆలయ ఈవో టంకశాల వెంకటేశంకు సమాచారం అందించాడు.
దీంతో ఆలయ లడ్డు, పులిహోర ప్రసాద తయారీ కేంద్రంలో పనిచేస్తున్న కొలగాని రవిని హుండీ లెక్కింపు నుంచి బయటకి తీసుకువచ్చి తనిఖీ చేయగా అతని వద్ద రూ.500 నోట్లు 22, రూ.10 నోటు 1 లభ్యం కావడంతో రూ.11,010ల హుండీలోని నగదు దొంగతనం చేసినట్టుగా భావించారు. వెంటనే మల్యాల సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్ఐలు తీగల అశోక్, కందుకూరి కుమారస్వామికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సదరు ఉద్యోగిని పోలీస్స్టేషన్కు తరలించారు.