మామడ, అక్టోబర్ 29: స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటూ నిర్మల్ జిల్లా మామడ ఎస్సై రాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాల ప్రకారం.. మామడ మండలం అనంతపేట్ గ్రామానికి చెందిన సల్కం సతీష్, సుదర్శన్ అదే గ్రామానికి చెందిన సోప్పరి నరేశ్ ఈ నెల 24న గొడవపడ్డారు. నరేశ్ వీరిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వీరికి పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్సై రాజు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సతీష్ సోదరుడు తిరుమల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆదివారం పోలీసుస్టేషన్లో ఎస్సై రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.