హైదరాబాద్: మరికొన్నిగంటల్లో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మధ్యాహ్నం 1.04 గంటలకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని విషయమై ఇంకా స్పష్టత రాలేదు. అయితే రాష్ట్రానికి ఒక్కరే ఉపముఖ్యమంత్రిగా ఉండనున్నారని వార్తలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా సీనియర్ నాయకుడు మల్లు భట్టివిక్రమార్కను (Bhatti Vikramarka) నియమించనున్నారని, మరో ముఖ్యనాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని తెలుస్తున్నది. ఇరువురికి కాబోయే సీఎం రేవంత్ స్వయంగా ఫోన్చేసినట్లు సమాచారం. వీరితోపాటు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ ఫోన్చేశారు.
ఇక పార్టీ సీనియర్ నాయకులైన దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మానిక్రావ్ థాక్రే ఫోన్ చేశారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. దీంతో ఈ ముగ్గురు నాయకులకు మంత్రివర్గంలో స్థానం ఖారరైనట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హోటల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉదయం 11 గంటలకు ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు. వారిని మూడు బస్సుల్లో ప్రమాణ స్వీకార వేదికకు తీసుకురానున్నారు. ఇప్పటికే హోటల్ వద్దకు మూడు ఏసీ బస్సులు చేరుకున్నాయి.