చేర్యాల, మార్చి 3 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారికి మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రూ.81,45,957 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఏ.బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి వివరాలను వెల్లడించారు. గురువారం ఈవో, చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. శనివారం రూ.4,17,080, ఆదివారం రూ.32,70,466, సోమవారం రూ.5,84,141, శివరాత్రి(మంగళ) రూ.19,26,980, బుధవారం రూ.19,47,290 ఆదాయం స్వామి వారికి ఖజానాకు సమకూరిందన్నారు.
బ్రహ్మోత్సవాలలో 7వ ఆదివారం(శని,ఆది,సోమ, మంగళ(శివరాత్రి), బుధ)వారం సందర్భంగా స్వామి వారి ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాలు, దర్శనాలు, కాటేజీలు తదితర వాటి ద్వారా ఆదాయం సమకూరిందన్నారు. గత సంవత్సరం భక్తుల రాక తక్కువగా ఉందని, ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో ఆదాయం సైతం పెరుగుతున్నట్లు తెలిపారు.