చేర్యాల, జనవరి 5 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవం(Mallanna Kalyanam) వైభవంగా నిర్వహించేందుకు ఆలయవర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(MLA Palla) తెలిపారు.శుక్రవారం కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పర్యటించి కల్యాణ వేదిక, గ్యాలరీలు, పోలీస్ బందోబస్తు తదితర వాటిని పరిశీలించారు.
అనంతరం క్యూలైన్లు పరిశీలించి ఆలయ ఈవో బాలాజీకి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సం నిర్వహించేందుకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. అన్నివర్గాల భక్తులు స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొని అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకునే విధంగా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
కల్యాణోత్సవానికి వచ్చిన ప్రతి భక్తుడికి తాగు నీటి వసతి కల్పించాలని, బస్ సర్వీస్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గీస భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, ఉపసర్పంచ్ కొండా శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు సార్ల కిష్టయ్య, మెరుగు శ్రీనివాస్గౌడ్, తలారి కిషన్, పడిగన్నగారి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.