పటాన్చెరు, మార్చి 9 : తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి బాగా జరుగుతున్నదని మాల్దీవ్స్ ప్రతినిధులు కొనియాడారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్డీ) అధికారుల ఆధ్వర్యంలో గురువారం మాల్దీవ్స్ బృందం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధనూర్లో పర్యటించింది. ఇందులో 23 మందితో కూడిన మాల్దివ్ ఎలెక్టెడ్ కౌన్సిల్ మెంబర్స్, మున్సిపల్ మెంబర్స్తోపాటు అధికారులు ఉన్నారు.
డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రాం డాక్టర్ అంజన్కుమార్ భంజ, ఎన్ఐఆర్డీ అధికారులు మధుసూదన్, తాఖీయొద్దీన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధికారులు మాల్దీవ్స్ బృందానికి వివరాలు వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలతోపాటు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, పారిశుద్ధ్యం అమలు, డంప్యార్డుల ఏర్పాటును మాల్దీవ్స్ ప్రతినిధులు పరిశీలించారు. తమది పర్యాటకంపై ఆధారపడిన దేశమని, తమవద్ద చెత్త సమస్య తీవ్రంగా ఉన్నదని వారు తెలిపారు.
తెలంగాణలో అమలవుతున్న తడి, పొడి చెత్త సేకరణ, డంప్యార్డుల నిర్వహణను తమ దేశంలోనూ అమలు చేసేందుకు ప్రతిపాదిస్తామని అన్నారు. హరితహారం కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా చేపడుతున్నారని వారు ప్రశంసించారు. కోతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆహార కేంద్రాన్ని చూసి మాల్దీవ్స్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు.