నాగర్కర్నూల్ : ప్రపంచంలోనే విశిష్ట కార్యక్రమం కంటి వెలుగు అని, గల్లీ గల్లీలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్లో కంటివెలుగు సమీక్షా సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధత్వాన్ని నివారించేందుకు వంద రోజుల్లో కంటి వెలుగు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. జిల్లాలో కంటివెలుగు శిబిరాల నిర్వహణ కోసం 50 బృందాలను నియమించినట్లు చెప్పారు.
కార్యక్రమం విజయవంతానికి వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ప్రజలను చైతన్యం చేసి పరీక్షలు చేయించాలని, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ప్రజలను చైతన్యం చేసి కంటివెలుగు పరీక్షలు చేయించాలని, అంధత్వం లేని రాష్ట్రాన్ని సాధిస్తామన్న నమ్మకాన్ని కలిగించాలన్నారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఎనిమిదేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగం సుభిక్షంగా మారిందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని, ప్రభుత్వ సబ్సిడీ గొర్రెల పథకం, ఉచిత చేప పిల్లల పథకం, పెరిగినా సాగుతో బలవర్ధక ఆహారం ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు, పెరిగిన ఉపాధి అవకాశాలు ప్రజలకు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతున్నదన్నారు.
ఆరోగ్యవంతమైన భవిష్యత్ తెలంగాణ సమాజం నిర్మాణమవుతున్నదని, రాబోయేకాలంలో ప్రపంచ ఆరోగ్యసూచీలో భారతదేశంలో తెలంగాణ మొదటిస్థానంలో నిలవనున్నదన్నారు. కంటివెలుగులో భాగంగా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లెనిద్రలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరు మనసుపెట్టి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ శాంతకుమారి, అదనపు కలెక్టర్ మనుచౌదరి, జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.